‘తోప్ టీవీ’ తాట‌ తీశారుగా..

తోప్ టీవీ.. ఈ పేరు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వివిధ ఓటీటీ ప్లాట్ఫాంలలో లభించే కంటెంట్ను పైర‌సీ చేసి.. తోప్ టీవీలో ఉచితంగా అందిస్తున్నారు. దీనికి లక్షల మంది యూజర్లు ఉన్నారు.

అతిపెద్ద పైరేటెడ్ ఓటీటీ ప్లాట్ఫాంగా ఇటీవ‌ల దీనిపై విమ‌ర్శ‌లు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిని నిర్వ‌హిస్తోంది.. ఎక్క‌డో.. విదేశీ వ్య‌క్తికాదు.. హైద‌రాబాద్‌కు చెందిన స‌తీశ్ వెంక‌టేశ్వ‌ర్లు. ఇత‌ని వ‌య‌సు 28 ఏళ్లు. హైదరాబాద్ గుర్రంగూడకు చెందిన ఇంజినీర్ అయిన సతీశ్ గ‌త రెండేళ్లుగా తోప్ టీవీ పేరుతో రూ.కోట్లు పోగాశార‌నే వార్త‌లు ఇటీవ‌ల వినిపించాయి.

అయితే.. ఈ పైర‌సీ తోప్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ప్రముఖ పైరసీ యాప్ ‘తోప్ టీవీ’ వ్యవస్థాపకుడు, సీఈఓ సతీశ్ వెంకటేశ్వర్లు(28)ను ముంబైకి చెందిన పోలీసులు గుట్టుచ‌ప్పుడు కాకుండా అరెస్టు చేశారు. హైదరాబాద్ గుర్రంగూడలోని సతీశ్ను తన నివాసంలోనే.. ముంబయి సైబర్ డిపార్ట్మెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆయనకు న్యాయస్థానం ఏడు రోజుల రిమాండ్ విధించింది. తోప్ టీవీపై వయాకామ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సహా పలు బ్రాడ్కాస్టింగ్ సంస్థలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఎలాంటి అనుమతులు లేకుండా కంటెంట్ను ప్రసారం చేయడాన్ని అడ్డుకోవాలని కోరాయి. ఈ నేపథ్యంలోనే యాప్తో పైర‌సీ చేస్తున్న‌ సతీశ్ను పోలీసులు అరెస్టు చేశారు.

స‌తీశ్ అరెస్టు తర్వాత తోప్ టీవీ సేవలు నిలిచిపోయాయి. మరోవైపు సతీశ్ అరెస్టు విషయం సోషల్ మీడియాలో ఆస‌క్తిక‌ర చర్చనీయాంశం గా మారింది. నిమిషాల వ్యవధిలోనే ట్విట్టర్లో ‘తోప్ టీవీ’ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది. పైరసీకి అడ్డుకట్ట పడిందని కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చని నెటిజన్లు ఫన్నీ పోస్టులు పెడుతున్నారు.

తోప్ టీవీని మిస్ అవుతున్నాం అంటూ మరికొందరు పోస్టులు చేశారు. ఏదేమైనా.. తోప్ టీవీతో అత్యంత వేగంగా దూసుకువ‌చ్చిన ఈ పైర‌సీ స‌తీశ్‌.. క‌ట‌క‌టాలు లెక్కించ‌క‌త‌ప్ప‌లేదు. ఇప్పుడు ఇది.. టాలీవుడ్ నుంచి బాలీ వుడ్ వ‌ర‌కు తీవ్ర సంచ‌ల‌నంగా బ్రేకింగ్ న్యూస్‌గా మార‌డం గ‌మ‌నార్హం.