వైసీపీకి ఆ స‌మ‌స్య ఉక్కిరి బిక్కిరే ?

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం ఇపుడు అధికార వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడాల్సిన బాధ్యత ఏపీలోని జగన్ ప్రభుత్వానిదేనని విపక్షాలు సహా అంతా అంటున్నారు. ఒక విధంగా స్టీల్ ప్లాంట్ విషయంలో నైతిక బాధ్యత ఏపీ సర్కార్ దే.

ఎందుకంటే విశాఖలో ఈ ప్లాంట్ కి అవసరం అయిన భూమిని వేల ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చింది. అలాగే విశాఖలో ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా సమకూర్చింది. ఈ నేపధ్యంలో కేంద్రం వాదన వేరేగా ఉంది. స్టీల్ ప్లాంట్ మీద యాజమాన్య హక్కులు అన్నీ మావేనని అంటోంది.

అదే విధంగా తాము ఏమైనా చేసుకుంటాం, అడిగేందుకు ఎవరికీ ఏ హక్కూ లేదన్నది వారి మాటగా ఉంది. ఇక ఏపీకి సంబంధించి ఏ చిన్న పని కూడా చేయడానికి కేంద్రం ఉత్సాహం చూపడంలేదు. అంతెందుకు దేశమంతా కేంద్ర మంత్రులు ఉన్నా ఏపీ నుంచి మాత్రం ఒక్కరు కూడా లేకుండా పోయారు.

మరి ఇది కూడా ఒక రకమైన రాజకీయ వివక్ష. ఏపీ నుంచి బీజేపీ తరఫున కేంద్ర మంత్రి ఉంటే నేరుగా విశాఖ స్టీల్ లాంటి వాటి ఒత్తిడి ఆయన మీద పడేది. ఇపుడు ఆ విధంగా కూడా వైసీపీయే భరించాల్సి వస్తోంది. దీని మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే మా శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నారు. పార్లమెంట్ లో దీన్ని ప్రస్తావించి గట్టిగా డిమాండ్ చేస్తామని కూడా చెబుతున్నారు.

అయితే కేంద్రం దీన్ని విని ఊరుకుంటే వైసీపీ ఎంపీలు ఏం ? చేయగలరు అన్నదే ఇక్కడ ప్రశ్న. స్టీల్ ప్లాంట్ విషయంలో ఇప్పటికే కేంద్రం చాలా దూరం వచ్చేసింది. అదే టైమ్ లో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఒక పాలసీగా పెట్టుకుని ముందుకు సాగుతోంది. కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కు తగ్గదు అన్నడానికి అచ్చమైన ఉదాహరణ సాగు చట్టాలే.

మరి ఉక్కు ప్రైవేటీకరణ వేటు నుంచి తప్పించుకోవడం అంటే అసాధ్యమే అని అంటున్నారు. ఈ విషయంలో మేము మా వంతు చేశామని వైసీపీ అనిపించుకోవడానికైతేనే పార్లమెంట్‌లో నాలుగు మాట‌లు మాట్లాడేస్తే సరిపోతుంది తప్ప ఉక్కుని కాపాడేందుకు కాదన్న సెటైర్లు కూడా పడిపోతున్నాయి.