మోడి థ్రెట్ కాంగ్రెస్ కాదు… బీకేయూ యేనా?

తొందరలో జరగబోతున్న వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి గట్టి దెబ్బ పడబోతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనుమానంగా ఉంది. గడచిన ఎనిమిది నెలలుగా మూడు నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనలన్నీ భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.

తాజా డెవలప్మెంట్లు ఏమిటంటే ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేయాలని బీకేయూ డిసైడ్ చేసింది. ప్రతి గ్రామం నుండి 10 మంది రైతులు 15 రోజుల పాటు ఆందోళనల్లో పాల్గొనాలని బీకేయూ అగ్రనేత రాకేష్ తికాయత్ పిలుపిచ్చారు. దీనివల్ల ఆందోళనల్లో వేడి తగ్గకుండా ఉంటుందని తికాయత్ అభిప్రాయపడ్డారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తికాయత్ యూపిలో జాట్ వర్గానికి చెందిన నేత. జాట్లలో ఆయనకు అపారమైన పట్టుంది. నూతన వ్యవసాయ చట్టాల కారణంగా యూపిలోని జాట్లలో మెజారిటి వర్గం కేంద్రానికి వ్యతిరేకమైంది. కేంద్రానికి వ్యతిరేకం అంటే ప్రధానంగా బీజేపీని వ్యతిరేకించటమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జాట్లతో పాటు రైతాంగంలో కూడా బీజేపీపై వ్యతిరేకత పెరిగిపోతోంది.

వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ పై బీకేయూ ప్రభావం బాగా పడనుంది. యూపీ, పంజాబ్ లో పార్టీల గెలుపోటముల్లో రైతులదే ప్రధాన పాత్ర. కాబట్టి ఈ లెక్కన చూసుకున్నపుడు బీజేపీకి రాబోయే ఎన్నికల్లో రైతాంగం నుండి వ్యతిరేకత పెరిగిపోవటం ఖాయం. మొన్నటి పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా బీకేయూ రాష్ట్రవ్యాప్తంగా అనేక సమావేశాలు, బహిరంగసభలు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తానికి జనాల్లో వ్యతిరేకత కాకుండా రైతాంగం వ్యతిరేకతను బీజేపీ ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సిందే.