కేటీఆర్‌కు సెగ పెడుతున్న ‘భాగ్య‌న‌గ‌రం’

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ పేరు ప్ర‌పంచ వ్యాప్తంగా బాగుంటుంది. ఇక్క‌డి బిర్యానీ, ఉస్మానియా బిస్క‌ట్, చాయ్‌.. ట్యాంక్ బండ్.. ఇలా అనేక విష‌యాలు హైద‌రాబాద్ పేరుకు బ్రాండ్‌గా మారాయి. అయితే.. గ‌త కొన్నేళ్లుగా వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే.. చాలు .. హైద‌రాబాద్ మునిగిపోతోంది. దీంతో ఈ బ్రాండ్ కాస్తా.. విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. గత సంవత్సరం వచ్చిన వరదల్లో 20రోజుల పాటు హైద‌రాబాద్ ప్రజలు బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎన్‌డీఆర్ఎఫ్‌ బృందాలతో పాటు ఇతర సహాయక బృందాలు వచ్చి బాధితులకు ఆహారం, తాగునీరు, మందులను పంపిణీ చేశాయి.

ఇప్పుడు మ‌ళ్లీ వ‌ర్షాలు మొద‌ల‌య్యాయి. దీంతో గత ఏడాది వరద ముంపును తలుచుకుని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అధికారుల ముందుచూపు లేమితో అవుట్‌లెట్‌ కాలువ నిర్మాణం చేయకుండా చెరువు చుట్టూ మట్టి కట్ట ఏర్పాటు చేయడంతో భారీ వర్షం వస్తే హైద‌రాబాద్ మునిగిపోయే ప్రమాదం ఉంది. మిషన్‌ కాకతీయ కింద 2018లో సరూర్‌నగర్‌ చెరువు అభివృద్ధి, సుందరీకరణ కోసం ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసింది. సుందరీకరణలో భాగంగా ముందుగా ఎగువ నీరు వచ్చే వరద నీరు చెరువులోకి రాకుండా చుట్టూ మట్టి కట్టలు కడుతున్నారు.

కానీ కట్టలు నిర్మించే ముందు పరిసర కాలనీల నుంచి వచ్చే వరద చెరువులోకి వెళ్లే ఏర్పాట్లు చేయాలి. కానీ వరద నీరు పోయేం దుకు చర్యలు చేపట్టకుండా హడావిడిగా చెరువు చుట్టూ మట్టి కట్టలు కట్టడం, ట్రాక్‌ నిర్మాణ పనులు చేపట్టడం వివాదాస్పదమ వుతోంది. ఇదిలావుంటే.. గ‌త ఏడాది వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌స‌మ‌యంలో.. ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించింది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ స్వ‌యంగా మోకాల్లోతు నీళ్ల‌లో ఆయా కాల‌నీల్లో తిరిగి ప్ర‌జ‌లను ప‌రామ‌ర్శించారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చేవ‌ర్షాకాలానికి(అంటే ఈ ఏడాది) వ‌ర‌ద విష‌యంలో నిర్ణ‌యం తీసుకుని క‌ట్ట‌డి చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప‌టిష్ట చ‌ర్య‌లూ చేప‌ట్ట‌లేదు. అస‌లు ఈ విష‌యాన్నే మ‌రిచిపోయారు. దీంతో ఇప్పుడు భాగ్య‌న‌గ‌ర వాసులు అల్లాడిపోతున్నారు. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో అని.. వారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నారు. చిన్న‌పాటి వ‌ర్షానికే ప‌లు ప్ర‌ధాన ర‌హ‌దారులు.. నిండిపోవ‌డం.. ఇళ్ల‌లోకి నీళ్లు చేర‌డం వంటివి కామ‌న్‌గా ఉన్న న‌గ‌రం రూపు రేఖ‌లు మారుస్తామ‌ని కార్పొరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ కేటీఆర్ హామీ ఇచ్చారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఆదిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదే ఇప్పుడు ఆయ‌నకు మ‌ళ్లీ సెగ‌పెడుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.