‘రోజా’ కాంబినేషన్.. ఎన్నేళ్లకెన్నేళ్లకు

madhubala

90ల్లో బాగా సినిమాలు చూసి ఆస్వాదించిన ప్రేక్షకులకు ‘రోజా’ ఒక మరపురాని జ్ఞాపకం. మణిరత్నం ప్రతిభ ఏంటో దేశం మొత్తానికి తెలిసేలా చేసిన చిత్రమిది. ఇందులో టైటిల్ రోల్ పోషించిన మధుబాల, ఆమెకు జోడీగా నటించిన అరవింద్ స్వామిలకు ఎంత పేరొచ్చిందో.. ఆ జోడీ ప్రేక్షకులకు ఎంతగా నచ్చిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వీళ్లిద్దరూ కలిసి చేసింది ఒకే సినిమా.

కానీ ఆ సినిమాతో ఎవర్ గ్రీన్ పెయిర్ అనిపించుకున్నారు. వాళ్లిద్దరూ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతారు. మామూలుగా ఒక హిట్, క్లాసిక్ సినిమాలో నటించిన నటీనటుల్ని కలిపి మళ్లీ సినిమాలు తీయడం మామూలే.

కానీ ఎందుకోగానీ ఎవ్వరూ అరవింద్, మధులతో మళ్లీ ఓ సినిమా చేయలేదు. కథానాయికగా మధు కెరీర్ ఎక్కువ కాలం కొనసాగకపోవడం.. అరవింద్ స్వామి కూడా మధ్యలో బ్రేక్ తీసుకోవడం ఇందుకు కారణం కావచ్చు. ఐతే ఈ జోడీని దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ కలిసి చూసే అవకాశం దక్కబోతోంది.

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఎ.ఎల్.విజయ్ ‘తలైవి’ సినిమా తీసిన సంగతి తెలిసిందే. జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అరవింద్ స్వామి ఎంజీఆర్ పాత్రలో కనిపించనున్నాడు. ఎంజీఆర్‌గా అతడి ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి జనాలు అవాక్కవడం తెలిసిందే. ఈ పాత్రకు ఇంకెవరూ ఇంత బాగా నప్పరు అనిపించాడు.

ఇందులో ఎంజీఆర్ భార్యగా మధుబాల కనిపించనుందట. ఎంజీఆర్‌కు, జయలలితకు ఉన్న సంబంధం.. తర్వాత ఆమే ఆయన రాజకీయ వారసురాలిగా మారడం అప్పట్లో ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఐతే భార్యకు కూడా ఎంజీఆర్ ఎంతో విలువ ఇచ్చాడని చెబుతారు. కాకపోతే ఆమె గురించి సామాన్య జనాలకు పెద్దగా తెలియదు.

మరి ‘తలైవి’లో ఈ జోడీని ఎలా ప్రెజెంట్ చేశారో చూడాలి. ఒక క్లాసిక్‌లో నటించిన జోడీ మూడు దశాబ్దాల తర్వాత ఇలా తెరపై కనిపించనుండటం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందనడంలో సందేహం లేదు.