కూతురు కోస‌మే ర‌మ‌ణ‌ను కేసీఆర్ కారెక్కించుకున్నారా ?

తెలంగాణలో మాజీ మంత్రి ఈట‌ల రాజేందర్ ఎపిసోడ్ అనంతరం తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈట‌ల తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో త్వరలోనే హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగనుంది.

విశ్వ‌స‌నీయ‌ వర్గాల సమాచారం ప్రకారం అక్టోబర్ లో హుజురాబాద్ ఉప ఎన్నిక ఉంటుందని తెలుస్తోంది. తెలంగాణలో బ‌ల‌మైన‌ బీసీ నేతగా ఉన్న‌ ఈటెల పార్టీ నుంచి బయటకు వెళ్లడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసుకునే క్రమంలోనే కేసీఆర్ తెలంగాణ తెలుగుదేశం తాజా మాజీ అధ్యక్షుడు ఎల్‌. రమణకు గాలం వేసినట్లు గానే పొలిటికల్‌ సర్కిల్‌లో ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఎల్‌.ర‌మ‌ణ టీఆర్ఎస్‌లోకి వ‌స్తే ఈట‌ల స్థానం భ‌ర్తీ అవుతుంద‌ని.. కేసీఆర్ అందుకే ర‌మ‌ణ‌ను పార్టీలోకి ఆహ్వానించ‌డంతో పాటు ఎమ్మెల్సీ కూడా ఇస్తున్నార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌రూ అనుకున్నారు. ఇక అవ‌స‌ర‌మైతే ర‌మ‌ణ‌కు ఎలాగూ ఎమ్మెల్సీ ఇస్తున్నందున కేసీఆర్ ఆయ‌న్ను హుజూరాబాద్ బ‌రిలో కూడా దించుతార‌నే అనుకున్నారు.

అయితే గులాబీ బాస్ మ‌దిలో ఉన్న స్కెచ్ ఇది కాద‌ట‌..! త‌న కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో జ‌గిత్యాల నుంచి పోటీకి దింప‌బోతున్నార‌ట‌. ఇందుకు గ్రౌండ్ వ‌ర్క్ రెడీ చేసే క్ర‌మంలోనే ర‌మ‌ణకు గాలం వేశార‌ని తెలుస్తోంది. ర‌మ‌ణ‌కు జ‌గిత్యాల‌లో మంచి ప‌ట్టు ఉంది. అక్క‌డ నుంచి ప‌లుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ర‌మ‌ణ.. క‌రీంన‌గ‌ర్ ఎంపీగా కూడా గెలిచారు.

ఇక జ‌గిత్యాల ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్ సైతం క‌విత వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే తాను త‌ప్పుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. పైగా గ‌త ఎన్నిక‌ల్లో క‌విత ప‌ట్టుబ‌ట్టి మ‌రీ జ‌గిత్యాల‌పై దృష్టి పెట్టి జీవ‌న్‌రెడ్డిని ఓడించింది. 2014లో ఇక్క‌డ జీవ‌న్‌రెడ్డి గెలిచారు. అందుకే క‌విత గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇక్క‌డే మ‌కాం వేసి మ‌రీ సంజ‌య్‌ను గెలిపించారు.

ఆమె గ‌త ఎన్నిక‌ల్లోనే ఇక్క‌డ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని అనుకున్నార‌… కేసీఆర్ ఒప్పుకోలేదు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఎంపీగ ఓడిన ఆమెను ఇప్పుడు ఎమ్మెల్సీని చేశారు. ఇక ఆమెకు మంత్రి ప‌ద‌వి ఇస్తార‌న్న వార్త‌లు ఉన్నాయి. అయితే క‌విత మాత్రం ఎమ్మెల్యేగా గెలిచాకే మంత్రి ప‌ద‌వి తీసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే కేసీఆర్ జ‌గిత్యాల‌లో క‌విత‌కు గ్రౌండ్ ప్రిపేర్ చేసే క్ర‌మంలోనే ర‌మ‌ణ‌ను కారెక్కించుకుంటున్న‌ట్టు టాక్ ?