టాలీవుడ్ నిర్మాతల్ని భయపెట్టేశారే..

పోయినేడాది కరోనా టైంలో నెలల తరబడి థియేటర్లు మూతపడ్డాయి. ఎప్పటికి అవి తెరుచుకుంటాయో తెలియని సందిగ్ధతలో కొందరు నిర్మాతలు తమ చిత్రాలను ఓటీటీల్లో రిలీజ్ చేసేశారు. ఎగ్జిబిటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ తగ్గలేదు. వేరే ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగులో ఓటీటీ బాట పట్టిన చిత్రాలే కానీ.. చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలు ఆ మార్గంలో రిలీజయ్యాయి.

వి, నిశ్శబ్దం లాంటి పెద్ద సినిమాలు ఓటీటీలో రిలీజ్ కావడం తెలిసిందే. ఒక దశలో ఎగ్జిబిటర్లు కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకున్నట్లే కనిపించారు. ఓటీటీల్లో రిలీజయ్యే చిత్రాల పట్ల మరీ అంత వ్యతిరేకత ఏమీ ప్రదర్శించలేదు.

కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా మాత్రం ఎగ్జిబిటర్ల స్పందన మరోలా ఉంది. ఇప్పటికే థియేటర్ ఇండస్ట్రీ బాగా దెబ్బ తినేసిన నేపథ్యంలో నిర్మాతలు మంచి అంచనాలున్న సినిమాలను ఓటీటీలకు ఇచ్చేసి వెండితెరలకు అన్యాయం చేస్తున్నారంటూ వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

ఈసారి తాడో పేడో తేల్చుకోవడమే అన్నట్లు ఎగ్జిబిటర్లు నిర్మాతలతో పోరాటానికి సై అనేశారు. నిర్మాతలు దారికి రాకుంటే థియేటర్లు మూసేసి వాటిని వేరే రకంగా ఉపయోగించుకోవడానికి కూడా వెనుకాడబోమని నిర్మాతలకు తేల్చి చెప్పేసినట్లు కనిపిస్తోంది. అలాగే ఇప్పుడు దారికి రాకుంటే రేప్పొద్దున సాధారణ పరిస్థితుల్లో థియేటర్ల కోసం విపరీతమైన పోటీ నెలకొన్న సమయంలో బదులు తీర్చుకుంటామని కూడా ఎగ్జిబిటర్ల నుంచి నిర్మాతలకు హెచ్చరికలు అందినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే కొత్తగా ఓటీటీ డీల్స్ చేసుకోవాలనుకుంటున్న వాళ్లే కాదు.. ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న వాళ్లు కూడా వెనక్కి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాత ‘నారప్ప’ ఓటీటీ రిలీజ్ విషయంలో వెనుకంజ వేసినట్లు చెబుతున్నారు. ఇప్పుడు నితిన్ ‘మాస్ట్రో’ విషయంలోనూ ఇదే జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. చూస్తుంటే పేరున్న సినిమాలేవీ కూడా ఓటీటీల్లో వచ్చే అవకాశాలే కనిపించడం లేదు. మొత్తానికి ఎగ్జిబిటర్లు ఈసారి గట్టిగా నిలబడి నిర్మాతలను బాగానే భయపెట్టినట్లున్నారు.