కేసీయార్ ఎవరికి భయపడుతున్నారు ?

‘బీజేపీ అంటే కేసీయార్ కి వణుకు మొదలైపోయింది’ ..బండి సంజయ్

‘కాంగ్రెస్ పార్టీని చూడగానే కేసీయార్ కి చెమటలు పడుతున్నాయ్’..రేవంత్

పై రెండు ప్రకటనలు కూడా కాస్త విచిత్రంగానే ఉన్నాయి. తమను చూడగానే కేసీయార్ భయపడిపోతున్నట్లు ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ అధినేతలు ఎవరికి వారుగా చెప్పేసుకుంటున్నారు. అసలింతకీ వీళ్ళద్దరికీ కేసీయార్ ఎందుకు భయపడాలి ? కేసీయార్ నే భయపెట్టేంత సీన్ పై ఇద్దరు నేతలకు ఉందా ? ఇఫుడిదే ప్రశ్న రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది.

నిజానికి తెలంగాణా రాజకీయ పార్టీల్లోని ఏ నేతకు కూడా కేసీయార్ ను భయపట్టేంత సీన్ లేదనే చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ లోని చాలామంది నేతలను తీసుకుంటే వాళ్ళ నియోజకవర్గాల్లో మాత్రమే కాస్త పట్టుంది. జిల్లా వ్యాప్తంగా పట్టున్న నేతల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. ఈ నేపధ్యంలో తమను తాము చాలా ఎక్కువగా ఊహించుకుని కేసీయార్ తమకు భయపడిపోతున్నట్లు చెప్పుకుంటున్నారు.

ఇక బీజేపీ నేతల సంగతి చాలా విచిత్రంగా ఉంటుంది. కమలం నేతల్లో చాలామందికి తమ నియోజకవర్గాల్లోనే పట్టులేదు. ఇపుడు బీజేపీకి అధ్యక్షునిగా ఉన్న బండి సంజయ్ మొన్నటి ఎంపి ఎన్నికల్లో గెలిచేంతవరకు బయట జనాల్లో చాలా మందికి అసలు తెలీనే తెలీదు. కాకపోతే అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి మంచి దూకుడుమీద ఉండటంతో జనాల్లో పాపులర్ అయ్యారంతే.

ఇంతోటిదానికి తామంటేనే కేసీయార్ భయపడిపోతున్నట్లు ఇద్దరు అధ్యక్షులు ఇచ్చుకుంటున్న బిల్డప్ చాలా విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ లోని నేతలంతా కలిసికట్టుగా కేసీయార్ కు వ్యతిరేకంగా గట్టిగా నిలబడినపుడు మాత్రమే టీఆర్ఎస్ కు ఇబ్బందులు మొదలవుతాయి. కానీ ఆపని ఎప్పుడు జరగాలి. ఇక కొత్తగా షర్మిల పెట్టిన పార్టీ అంటారా నాలుగు రోజులు పోతేగాని ఎలాగుంటుందో తెలీదు. కాబట్టి వెయిట్ చేయాల్సిందే.