త్వరలో రాజమౌళితో కూర్చుంటా : వినాయక్

Vinayak-Rajamouli

దశాబ్దంన్నర కిందట దర్శక ధీరుడు రాజమౌళి, ప్రభాస్‌ల కాంబినేషన్లో వచ్చిన ‘ఛత్రపతి’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఆ చిత్రం తమిళం, కన్నడ భాషల్లో రీమేక్ అయి రెండు చోట్లా విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం హిందీలోకి వెళ్తున్న సంగతి తెలిసిందే.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. బాలీవుడ్లో పేరు మోసిన సంస్థ అయిన పెన్ మూవీస్ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌ను నిర్మిస్తుండటం విశేషం.

ఈ రీమేక్ కోసం ‘ఛత్రపతి’ ఒరిజినల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా పని చేస్తున్నట్లు దర్శకుడు వి.వి.వినాయక్ వెల్లడించాడు. బాలీవుడ్లో ‘భజరంగి భాయిజాన్’, ‘మణికర్ణిక’ లాంటి చిత్రాలకు పని చేసిన విజయేంద్రకు హిందీ ప్రేక్షకుల అభిరుచిపై మంచి అవగాహనే ఉంది. ఈ అనుభవంతోనే ‘ఛత్రపతి’ రీమేక్‌కు ఇన్‌పుట్స్ ఇచ్చారని.. ఆయనతో కలిసి స్క్రిప్టు మీద చర్చించామని.. విజయేంద్ర కొన్ని మార్పులు చేర్పులు కూడా సూచించారని వినాయక్ వెల్లడించాడు.

తన టీంతో కలిసి ఎంతో కసరత్తు చేశాకే ఈ రీమేక్‌ను పట్టాలెక్కిస్తున్నట్లు వినాయక్ తెలిపాడు. ఐతే ‘ఛత్రపతి’ ఒరిజినల్ డైరెక్టర్ రాజమౌళికి ఖాళీ లేక ఈ సినిమా గురించి ఆయనతో మాట్లాడలేదని.. త్వరలోనే రాజమౌళితో ఒకసారి కూర్చుంటానని వినాయక్ చెప్పాడు.

ఇక ‘ఛత్రపతి’ని హిందీలో రీమేక్ చేయాలని తాను కానీ, బెల్లంకొండ శ్రీనివాస్ కానీ అనుకోలేదని.. ఆ ప్రాజెక్టే తమ వద్దకు వచ్చిందని వినాయక్ చెప్పాడు. శ్రీనివాస్‌ డబ్బింగ్ సినిమాల ద్వారా హిందీలో మంచి గుర్తింపు సంపాదించాడని.. పెన్ మూవీస్ అధినేత జయంతిలాల్ గడ దగ్గర చాన్నాళ్ల నుంచే ‘ఛత్రపతి’ రీమేక్ హక్కులున్నాయని.. ఆయనే శ్రీనివాస్‌తో ఈ సినిమా చేయాలని అనుకుని సంప్రదించాడని.. తర్వాత తాను ఈ ప్రాజెక్టులోకి వచ్చానని వినాయక్ తెలిపాడు. పెన్ మూవీస్‌లోనే తాను మరో సినిమా చేయబోతున్నానని.. దాని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని ఆయనన్నాడు.