హీరోయిన్ కి బెదిరింపులు!

తమిళ, మలయాళ ఇండస్ట్రీలలో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన సనమ్ శెట్టి తెలుగులో మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తరువాత ‘సింగం 123’, ‘ప్రేమికుడు’ లాంటి సినిమాల్లో నటించింది. అయితే కొన్ని నెలలుగా ఈమెని ఓ ఆకతాయి వేధిస్తున్నాడు. మొదట్లో ఈ వేధింపులను ఆమె పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఏకంగా ఆమెని, ఆమె కుటుంబాన్ని చంపేస్తానంటూ అతడు బెదిరిస్తుండడంతో సనమ్ శెట్టి పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయాలను ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది ఈ భామ.

గత కొన్నాళ్లుగా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లలో దారుణమైన మెసేజ్ లు వస్తున్నాయని.. మొదట వాటిని పట్టించుకోలేదని.. కానీ ఇప్పుడు ఏకంగా తన ఫోన్ నెంబర్ కు బెదిరింపు మెసేజ్ లు పంపిస్తున్నారని తెలిపింది. ఆ వ్యక్తి తన వ్యక్తిగత విషయాలను కూడా సేకరించినట్లు అనిపించడంతో వెంటనే అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. ఎవరికైనా ఇలాంటి బెదిరింపులు ఎదురైతే లైట్ తీసుకోవద్దని.. బయటకు చెప్పి సాయం తీసుకోవాలని సూచించింది.

ఇలా చేయడం వలన వేరే వాళ్లకు కూడా సాయం చేసినట్లు అవుతుందని చెప్పుకొచ్చింది. సనమ్ శెట్టి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని రాయ్ జాన్ పాల్ గా గుర్తించారు. అయితే అతడు ఒక్కడే ఈ బెదిరింపులకు పాల్పడుతున్నాడా..? లేక దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనను చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న చెన్నై పోలీసులకు సనమ్ శెట్టి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పింది. అలానే ఇన్ని రోజులుగా తనకు ధైర్యం చెబుతూ తోడుగా ఉన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది.