అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు కిషన్ రెడ్డి..!

కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. దీనిలో.. బీజేపీ నేత కిషన్ రెడ్డి కి కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి పదవి నుంచి… కేంద్ర కేబినేట్ మంత్రిగా పదోన్నతి పొందారు. ఈ నేపథ్యంలో.. కిషన్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లివిరిస్తున్నాయి. తాజాగా.మెగాస్టార్ చిరంజీవి కూడా కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.

మన దేశం యోగ్యతలను, ప్రత్యేకతలను ప్రపంచానికి తెలియజేయడానికి కిషన్‌ రెడ్డికి మంచి అవకాశం లభించిందన్నారు. ఆ అనుభూతిని, అధికారాన్ని అనుభవించినందుకు థ్రిల్లింగ్‌గా ఉందని చిరంజీవి ట్వీట్‌ చేశారు. కాగా, గ‌త కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చిరంజీవి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే శాఖ.. కిషన్ రెడ్డికి రావడం విశేషం.

కిషన్‌రెడ్డి విషయానికి వస్తే.. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ ఎంపీగా కొనసాగుతున్నారు. ఎంపీగా గెలుపొందిన ఆయనకు తొలి ప్రయత్నంలోనే కేంద్ర సహాయ మంత్రి పదవి లభించగా.. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు కేబినెట్‌ బెర్త్‌ దక్కింది. తెలంగాణ నుంచి కేబినెట్‌ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తొలి వ్యక్తి కూడా ఈయనే కావడం విశేషం.