షర్మిల హామీ అమలయ్యేదేనా ?

తెలంగాణాలో వైఎస్సార్ తెలంగాణా పార్టీ (వైఎస్సార్టీపీ)ని ఏర్పాటు చేసిన సందర్భంగా వ్యవస్ధాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలా మాటలే చెప్పారు. దాదాపు గంటన్నరపాటు చేసిన ప్రసంగంలో తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఘనత గురించి చాలానే చెప్పారు. తెలంగాణాకు వైఎస్ చేసిన సేవలను అమలుచేసిన సంక్షేమ పథకాలను గుర్తుచేశారు. వైఎస్ పాలనను, కేసీయార్ పాలనలోని వ్యత్యాసాన్ని పదే పదే ప్రస్తావించారు.

తమ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందనే నమ్మకాన్ని షర్మిల పదే పదే చెప్పుకున్నారు. అనేక విషయాలను ప్రస్తావించిన షర్మిల ప్రధానంగా రెండు హామీలను ఇచ్చారు. మొదటిదేమో అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతం సీట్లను మహిళలకే కేటాయిస్తానన్నారు. అలాగే జనాభా ప్రాతిపదికన బీసీలకు ప్రాతినిధ్యం కల్పిస్తానని బహిరంగంగా హామీ ఇచ్చారు.

ఇక్కడ గమనించాల్సిన రెండో హామీ అమలులో పెద్దగా కష్టపడాల్సిన అవసరంలేదు. అమలులో చిత్తశుద్ది ఉంటే చాలు. కానీ సమస్యంతా మొదటి హామీ అమలులోనే ఎదురవుతుంది. షర్మిల ఇచ్చిన హామీ ప్రకారం ఉన్న 119 అసెంబ్లీ సీట్లలో సుమారు 60 సీట్లను మహిళలకే కేటాయించాలి. 60 సీట్లను మహిళలకు కేటాయించటమంటే జరిగేపనికాదు. ఒకటి అన్ని సీట్లలో గట్టి అభ్యర్ధులు దొరకరు. రెండోది అభ్యర్ధులు దొరకనిపక్షంలో ఎక్కువమంది గెలిచేది కష్టమే.

మహిళలను తక్కువగా చూడటం కాదుకానీ రాజకీయంగా క్షేత్రస్ధాయిలో ఉన్న వాస్తవమే ఇది. మహిళా నేతల్లో రేణుకా చౌదరి, డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. ఎక్కడైనా మహిళలకు టికెట్లిచ్చినపుడు పార్టీల గాలుంటే గెలుస్తారు లేకపోతే ఓటమి తప్పదు. పలానా నియోజకవర్గంలో మహిళే పోటీచేయాలని రాజ్యాంగంలో లేదు. స్ధానికసంస్ధల్లో మహిళలకు రిజర్వేషన్ ఉన్నట్లే అసెంబ్లీ, పార్లమెంటుకు లేదు.

కొత్తగా పార్టీపెట్టి జనాల్లోకి వెళ్ళదలచుకున్న షర్మిల తన పార్టీ తరపున అంతమంది మహిళా అభ్యర్ధులను ఎలా గెలిపించగలనని అనుకున్నారో అర్ధం కావటంలేదు. హోలు మొత్తంమీద చూస్తే షర్మిల ఇఛ్చిన హామీ వినటానికి బాగానే ఉందికానీ అమల్లోకి వచ్చే అవకాశమైతే తక్కువనే చెప్పాలి. మరిలాంటి హామీలతో అధికారంలోకి కచ్చితంగా వచ్చేస్తామని ఎలా ప్రకటించారో షర్మిలకే తెలియాలి.