హిందువులు అత్యధికంగా ఆరాధించే దేవుడు ఎవరంటే?

హిందువులు అన్నంతనే గుర్తుకు వచ్చే దైవం శ్రీరాముడు. అందులో నిజం ఎంతన్న దానిపై ఎవరూ ఇప్పటివరకు అధ్యయనం చేయలేదు. తాజాగా అమెరికాకు చెందిన ఒక సంస్థ చేసిన సర్వే ఫలితం షాకిచ్చేలా ఉంది. హిందువులు ఎక్కువగా కొలిచే దేవుడు ఎవరన్న అంశంపై పీవ్ రీస‌ర్చ్ సెంట‌ర్ సర్వే నిర్వహించింది. హిందువులు అన్నంతనే శ్రీరాముడి పేరు వినిపించటం.. దాని చుట్టూ కొన్నేళ్లుగా బోలెడంత రాజకీయం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. రాజకీయం తిరిగేది శ్రీరాముడి చుట్టూ అయినా.. హిందువులు ఆరాధించేది మాత్రం శివుడిగా తేల్చింది తాజా సర్వే.

శివుడ్ని అత్యధికంగా హిందువులు కొలుస్తారని.. హిందువుల్లో దాదాపు 45 శాతం మంది ఆయన్ను ఆరాధిస్తారని సర్వే ఫలితం తేల్చింది. శివుడి తర్వాతి స్థానం హనుమంతుడిగా గుర్తించారు. ఆ తర్వాత వరుసలో వినాయకుడు (గణేశ్).. లక్ష్మీ.. కృష్ణుడు.. కాళీమాత.. చివర్లో రాముడు ఉండటం గమనార్హం. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. శ్రీరామచంద్రుడి కంటే కూడా ఆయన బంటు హనుమంతుడినే ఎక్కువ మందిని ఆరాధిస్తారని గుర్తించారు.

శ్రీరాముడ్ని కేవలం 17 శాతం మంది హిందువులు పూజిస్తామని చెబితే.. హనుమంతుడ్ని మాత్రం 32 శాతం మంది ఆరాధిస్తామని సర్వేలో వెల్లడించారు. తమ సర్వేను దాదాపు 30 వేల మందితో నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ అధ్యయనం 2019 నవంబరు నుంచి 2020 మార్చి మధ్యలో జరిగినట్లు వెల్లడించారు. ఈ రిపోర్టును ఈ మధ్యనే విడుదల చేశారు. ఈ సర్వేలో మరిన్ని ఆసక్తిర అంశాల్ని పేర్కొన్నారు.

అత్యధిక భారతీయులు తమకు ఇతర మతాలతో ఇబ్బంది ఏమీ లేదని స్పష్టం చేశారట. అయితే.. తమ పొరుగున ఉన్న వారు మాత్రం తమ మతస్థులైతే బాగుంటుందన్న భావనను వ్యక్తం చేశారట. ఇలాంటి అభిప్రాయాన్ని చెప్పిన వారిలో జైనులు అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తాము సర్వే చేసిన జైన మతస్థుల్లో 61 శాతం మంది తమ ఇరుగుపొరుగు వారు తమ మతస్థులే అయితే బాగుంటుందని చెప్పినట్లుగా సర్వే వెల్లడించింది.

దేశ విభజన జరిగి 75 ఏళ్లు అవుతున్నప్పటిని.. నాడు జరిగిన ఘర్షణలకు కారణం ఏమిటన్న విషయానికి.. ఎక్కువ మంది మతమే కారణంగా పేర్కొన్నారు. సర్వే చేసిన హిందువుల్లో 89 శాతం మంది తమకు నచ్చిన మతాన్ని స్వేచ్ఛగా పాటిస్తున్నట్లు పేర్కొనగా.. కేవలం ఐదు శాతం మంది ముస్లింలు.. హిందువులు మాత్రమే మత వివక్ష ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.

సర్వేలో పాల్గొన్న హిందువుల్లో 77 శాతం మంది కర్మ సిద్ధాంతాన్ని నమ్మగా.. 73 శాతం మంది విధిని కూడా బలంగా నమ్ముతున్నట్లు వెల్లడించారు. అదేసమయంలో సర్వేలో పాల్గొన్న ముస్లింలలో 27 శాతం మంది ముస్లింలు పూర్వ జన్మపై నమ్మకం ఉందని చెప్పారు. ఈ సర్వే మొత్తంలో షాకింగ్ అంశం.. శ్రీరాముడిని ఆరాధిస్తామని చెప్పే వారు తక్కువగా ఉండటం. మరి.. ఇంత తక్కువమంది శ్రీరాముడ్ని ఆరాధించినప్పటికీ.. ఆయన చుట్టూనే దేశ రాజకీయాలు తిరగటం.. ఆయన ప్రభావం భారతీయుల మీద ఉండటం విశేషమని చెప్పక తప్పదు.