షర్మిల పార్టీపై సర్వే… రిజల్టు నిజమేనా ?

సోషల్ మీడియాలో ఓ సర్వే వైరలవుతోంది. అదేమిటంటే పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల తాను పెట్టబోయే పార్టీ విషయమై జనస్పందన తెలుసుకునేందుకు సర్వే చేయించారట. మొత్తం 33 జిల్లాలో జరిగిన సర్వే ప్రకారం మంచి సానుకూల రిపోర్టు వచ్చిందట. చెన్నైకి చెందిన నేషనల్ పొలిటికల్ కన్సెల్టెన్సీ (ఎన్పీసీ) ద్వారా సర్వే చేయించుకున్నారట.

ఈ సర్వేలోని ముఖ్యమైన అంశాలేమిటి ? ఏమిటంటే తెలంగాణా వ్యాప్తంగా దివంగత వైఎస్సార్ పై జనాల్లో అభిమానం ఎలాగుంది ? అప్పట్లో వైఎస్ అమలుచేసిన సంక్షేమ పథకాలపై జనాల్లో ఎలాంటి అభిప్రాయాలున్నాయి ? పార్టీ పెడితే షర్మిలను ఆధరిస్తారా ? కేసీయార్ పాలన ఎలాగుంది ? జిల్లాల్లో మంత్రులు, నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎంఎల్ఏలపై జనాభిప్రాయం ఏమిటి ? రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ తరపున ఎలాంటి అభ్యర్ధులను జనాలు కోరుకుంటున్నారు ? లాంటి అంశాలపై సర్వే జరిగిందట.

సర్వే ప్రకారం వైస్ పై 72 నియోజకవర్గాల్లోని జనాల్లో సానుకూల స్పందన కనబడిందట. ఖమ్మం, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలతో పాటు ఆదిలాబాద్ లాంటి మారుమూల జిల్లాల్లో కూడా వైఎస్ పై జనాల్లో అభిమానం చెక్కు చెదరలేదని సర్వేలో తేలిందట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఉన్న 119 నియోజకవర్గాల్లో 72 నియోజకవర్గాల్లో వైఎస్ పై జనాల్లోని అభిమానం చెక్కు చెదరలేదంటే మామూలు విషయంకాదు. సర్వే ఫలితం గనుక నిజమే అయితే కేసీయార్ కు డేంజర్ బెల్స్ ఖాయమనే చెప్పాలి.