బీజేపీకి కష్టమేనా ?

Modi

తొందరలో ఉత్తరప్రదేశ్ లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి పెద్ద పరీక్షగా మారబోతున్నాయా ? అవుననే అనిపిస్తోంది క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే. ఒకవైపు పెద్దపార్టీలు, మరోవైపు చిన్న పార్టీలు కమలంపార్టీకి సవాలు విసురుతున్నాయి. పెద్దపార్టీల్లో ఎస్పీ, బీఎస్పీ యూపిలో బలమైన ప్రాంతీయ పార్టీలన్న విషయం అందరికీ తెలిసిందే.

పై రెండు పార్టీలు కాకుండా జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) ఎలాగూ ఉండనే ఉన్నాయి. ఇవికాకుండా చిన్నా చితకా పార్టీలు చాలానే ఉన్నాయి. వీటిలో చెప్పుకోదగ్గవి ఓ మూడున్నాయి. చిన్నవే కదాని తీసిపారేసేందుకు లేదు వీటిని. ఎందుకంటే యూపీలోని కొన్ని ప్రాంతాల్లో గట్టి ప్రభావం చూపగలవన్న విషయం గతంలోనే రుజువయ్యాయి.

ఇలాంటి పార్టీల్లో ఆజాద్ సమాజ్ పార్టీ ఒకటి. బీమ్ ఆర్మీ పేరుతో చెలామణి అవుతున్న పార్టీ ఎస్సీలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. దీని వ్యవస్ధాపక అధ్యక్షుడు చంద్రశేఖర్ కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనెల 21వ తేదీవరకు సైకిల్ యాత్ర చేస్తారు. ఈ పార్టీకి ఎస్సీల్లో మంచి పట్టుంది. రాబోయే ఎన్నికల్లో బీమ్ పార్టీ దెబ్బ ఎవరికి తగులుతుందో అర్ధం కావటంలేదు. ఇప్పటివరకు బీహార్ కు మాత్రమే పరిమితమైన వికాస్ ఇన్సాస్ పార్టీ (వీఐపీ) యూపిలో పోటీ చేయాలని డిసైడ్ అయ్యింది.

దీని అధ్యక్షుడు ముఖేష్ సాహ్ని రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. నిషాద్ లను ఏకం చేయటమే లక్ష్యంగా ఈయన పర్యటనలుంటున్నాయి. యూపిలో 14 శాతం నిషాద్ జనాభా ఉంది. తమకు ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని సాహ్నీ డిమాండ్ చేస్తున్నారు. 70 నియోజకవర్గాల్లో నిషాద్ కు బలమైన ఓటుబ్యాంకుంది. అందుకనే 150 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను రెడీ చేస్తున్నారు. బందిపోటు రాణి పూలన్ దేవి నిషాద్ కు ఒకపుడు పెద్ద దిక్కు.

ఇక ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) కూడా రంగంలోకి దూకుతోంది. యూపీకి ఆనుకునే ఢిల్లీ ఉండటం ఆప్ కు బాగా కలిసివచ్చే అవకాశం. ఎలాగంటే ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ కు క్లీన్ చిట్ ఉంది. మూడోసారి సీఎం అయిన కేజ్రీవాల్ పరిపాలన ఎలాగుందో యూపీ జనాలకు బాగా తెలిసే ఉంటుంది. ఎన్నికల్లో గెలవటం ద్వారా నిర్ణయాత్మక పాత్రను పోషించాలని ఆప్ డిసైడ్ అయ్యింది. తాజాగా జరిగిన స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించినట్లు కాదు అసెంబ్లీ ఎన్నికల్లో గెలవటం. ఎందుకంటే కమలంపార్టీని పెద్దా చిన్న పార్టీలు అన్నీవైపుల నుండి కమ్ముకుంటున్నాయి.