నిమ్మరసంతో కరోనా పాజిటివ్.. ఇదో పెద్ద హ్యాక్..!

కరోనా మహమ్మారి మన దేశంతోపాటు.. ప్రపంచ వ్యాప్తంగా అందరినీ అతలాకుతలం చేసేసింది. ఈ వైరస్ పేరు చెబితేనే చాలా మంది భయపడిపోయారు. అయితే.. ఇప్పుడు అదే కరోనా మహమ్మారిని ఉపయోగించుకొని కొందరు టీనేజర్లు.. ఎంజాయ్ చేస్తున్నారట. ఏంటి అర్థం కాలేదా..? వారికి కరోనా రాకున్నా.. వచ్చినట్లు ఫేక్ రిజల్ట్ చూపించి.. అది కూడా నిమ్మరసం ఉపయోగించి హ్యాక్ చేసి.. స్కూళ్లు, కాలేజీలు ఎగ్గొడుతున్నారు. ఈ సంఘటన యూకేలో చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బ్రిటన్ లో మాత్రం కొందరు విద్యార్థులు స్కూల్ ఎగ్గొట్టడానికి కొత్త పద్దతులు వాడుతున్నారు. దీనికి సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ వీడియోలను ఉపయోగించుకోవడం గమనార్హం. అందులోని వీడియోలు చూసి కొందరు కరోనా టెస్టుల్లో ఫేక్ రిపోర్టులు క్రియేట్ చేసి స్కూల్ యాజమాన్యాలకు పంపుతూ ఎంచక్కా ఇంటి దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారించుకుని ఇలా బ్రిటన్ టీనేజర్లు స్కూళ్లు ఎగ్గొడుతున్నారు.

ఇక కొవిడ్ టెస్టుల్లో పాజిటివ్‌ వచ్చేందుకు టిక్‌టాక్‌ వీడియోల్లో చూపించినట్లు నిమ్మరసం, వెనిగర్‌ను వినియోగిస్తున్నారు. దీంతో వైరస్ సోకని వారికి కూడా యాంటీజెన్ టెస్టుల్లో పాజిటివ్‌గా చూపిస్తోంది. టీనేజర్లు అనుసరిస్తున్న ఈ వింత పోకడల పట్ల విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరదా కోసం చేసిన ఈ పని వింటే కాసేపు నవ్వుకోవడానికి బాగుంటుంది.. కానీ.. వాళ్ల భవిష్యత్తుకే ప్రమాదం కదా అని వాపోతున్నారు.