ఎన్టీఆర్ ఎంఈకే షోకు రెడీ

జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెరపై వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. నాలుగేళ్ల కిందట ‘బిగ్ బాస్’ షోతో అతను చిన్నపాటి ప్రకంపనలు సృష్టించాడు. తెలుగు ప్రేక్షకులకు కొత్త అయిన ‘బిగ్ బాస్’ను తొలి సీజన్లో తనదైన శైలిలో హోస్ట్ చేసి అందరి మెప్పూ పొందాడు తారక్. అతను ఆ షోకు హోస్ట్‌గా తర్వాతి సీజన్లలోనూ కొనసాగుతాడని అంతా ఆశించారు కానీ.. ఒక్క సీజన్‌తోనే షోకు టాటా చెప్పేసి వెళ్లిపోయాడు. మళ్లీ ఇటు వైపు చూడలేదు.

ఇక మళ్లీ ‘బిగ్ బాస్’లో తారక్‌ను చూసే అవకాశాలు దాదాపు లేనట్లే. ఐతే ఆ షోకు దూరమైనప్పటికీ.. మళ్లీ బుల్లితెరలోకి మరో షోతో రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించడం తారక్ అభిమానులను అమితానందానికి గురి చేసింది. అతను ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కొత్త వెర్షణ్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’తో పునరాగమనానికి సిద్ధం కావడం తెలిసిందే. కొన్ని నెలల కిందటే జెమిని టీవీలో ఈ షోను ప్రకటించారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ తారక్‌ను దీని హోస్ట్‌గా వెల్లడించారు.

ఐతే అప్పుడు కొన్ని రోజుల్లోనే మొదలు కావాల్సిన షో కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ ఏడాదికి ఇక ఈ షో ఉండదేమో అన్న సందేహాలు నెలకొన్నాయి కానీ.. అలాంటిదేమీ లేదని తేలింది. త్వరలోనే షోను మొదలుపెట్టబోతున్నారు. ఇందుకోసం తారక్ కూడా డేట్లు కూడా కేటాయించినట్లు సమాచారం. త్వరలోనే షూటింగ్ కూడా మొదలు కానుందట. ముందుగా కొన్ని ఎపిసోడ్ల చిత్రీకరణ పూర్తి చేసి టీవీలో ప్రసారం చేస్తారట. తర్వాత తారక్ కొంచెం గ్యాప్ తీసుకుంటాడు.

‘ఆర్ఆర్ఆర్’ టాకీ పార్ట్ మొత్తం పూర్తయిపోగా.. ఇందులో రెండు పాటల చిత్రీకరణ మిగిలి ఉంది. అందులో ఒక పాట తారక్, చరణ్‌ల మీద తీస్తారు. ఆ పని పూర్తి చేసి ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షోలోకి వెళ్లిపోతాడని.. తర్వాత ఈ షో చేస్తూనే కొరటాల శివ చిత్రం షూటింగ్‌లోనూ పాల్గొంటాడని సమాచారం. ఈ షో ఎప్పుడు మొదలయ్యేది త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.