‘రాధేశ్యామ్’ చివర్లో కన్నీళ్లేనట

ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న చిత్రాల్లో అత్యధిక అంచనాలున్న వాటిలో ‘రాధేశ్యామ్’ ఒకటి. బాహుబలితో దేశవ్యాప్తంగా తిరుగులేని ఆదరణ సంపాదించుకున్న ప్రభాస్.. వివిధ భాషల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రమిది. ‘బాహుబలి’ మాత్రమే కాక చాలా ఏళ్ల నుంచి ప్రభాస్ యాక్షన్ ప్రధానంగా, మాస్ లక్ష్యంగా సాగే చిత్రాలే చేస్తుండగా.. చాన్నాళ్లకు అతను చేసిన పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రమిది.

‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ‘రాధేశ్యామ్’ పరిస్థితులు అనుకూలిస్తే ఇంకొన్ని నెలల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో నడుస్తుందని ముందు నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఇందులో ట్రాజిక్ క్లైమాక్స్ ఉంటుందని గతంలోనే ప్రచారం సాగింది. ఐతే అది ఊహాగానమే అనుకున్నారు.

కాగా చిత్ర వర్గాల నుంచి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం చివర్లో భావోద్వేగాలను పిండేసేలా ఉంటుందట. క్లైమాక్స్ ట్రాజిక్‌గానే ఉంటుంది కానీ.. సినిమాలో ప్రభాస్ చనిపోడట. అతను చేస్తున్న విక్రమాదిత్య పాత్ర బతికే ఉంటుందని.. పూజా హెగ్డే పోషిస్తున్న ప్రేరణ పాత్ర మాత్రం చనిపోతుందని అంటున్నారు. హీరోయిన్ చనిపోయినా అది జస్టిఫయింగ్‌గానే ఉంటుందని.. క్లైమాక్స్‌కు బలం చేకూర్చి ప్రేక్షకులను ఉద్వేగానికి గురి చేేసేలా సినిమాను ముగించనున్నారని సమాచారం.

ఒకప్పుడైతే హీరోనో హీరోయినో చనిపోతే మన ప్రేక్షకులు అంగీకరించేవారు కాదు కానీ.. గత కొన్నేళ్లలో ఈ ఆలోచన మారింది. కన్విన్సింగ్‌గా ఉంటే ట్రాజిక్ క్లైమాక్స్‌లను కూడా అంగీకరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘సైరా’లో కూడా విషాదాంతాన్ని అంగీకరించడం తెలిసిందే. మరి ‘రాధేశ్యామ్’లో పూజా హెగ్డే పాత్ర చనిపోతే వాళ్ల ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడాలి.