బీసీ ఉద్య‌మాలు.. ఒక రాజ‌కీయ వ్యూహం!

బీసీలు.. ఈ మాట అన‌గానే రాజ‌కీయ పార్టీల‌కు, నేత‌ల‌కు ఎన‌లేని ప్రేమ పొంగిపోతుంది. బీసీల‌కు ప్రాధాన్యం ఇస్తున్నామ‌నికూడా వారు ప్ర‌క‌టించుకుంటారు. అయితే.. వాస్త‌వంలోకి వ‌చ్చే స‌రికి.. ఏపీలో ఏ ప్ర‌బుత్వం ఉన్నా.. బీసీలు ఎప్ప‌టిక‌ప్పుడు ఉద్య‌మం పేరిట దూకుడుగా ఉంటూనే ఉన్నారు. మ‌రి దీనికి రీజ‌నేంటి? అనేది ఆస‌క్తిగా మారింది.

బీసీల కు ప్ర‌త్యేకంగా పార్టీని ఏర్పాటు చేస్తామ‌ని కూడా ఇటీవ‌ల కాలంలో బీసీ సంఘాల నాయ‌కులు కేస‌న శంక‌ర్రావు వంటివారు ప్ర‌క‌టిస్తున్నారు. అయితే.. వాస్త‌వానికి వీరిలో నిజానికి ఉన్న ల‌క్ష్యం ఏపాటిది? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

ఎందుకంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజ‌కీయంగా చూసుకున్నా.. ప‌ద‌వుల ప‌రంగా చూసుకున్నా.. బీసీల‌కు త‌గిన ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌నే వాద‌న ఉంది. అదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు కూడా ప్ర‌బుత్వాలు ఏమీ చేయ‌డం లేద‌నే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

గ‌తంలో ఆయా స‌మ‌స్య‌ల‌పై ఉమ్మ‌డి రాష్ట్రంలో బీసీ నేత‌లు.. పోరాటాలు చేశారు. లాఠీ దెబ్బ‌లు సైతం తిన్నారు. దీనికి ఆర్‌. కృష్ణ‌య్య నేతృత్వం వ‌హించ‌డంతో.. ఆయ‌న పేరు అప్ప‌ట్లో మార్మోగిపోయింది. కొన్నాళ్లు బాగానే బీసీ ఉద్య‌మాలు సాగినా.. త‌ర్వాత రాష్ట్ర విభ‌జ‌న‌తో.. కృష్ణ‌య్య రాజ‌కీయ రంగంలోకి ప్ర‌వేశించారు.

ప్ర‌జాప్ర‌తినిధిగా కూడా కృష్ణ‌య్య గెలుపు గుర్రం ఎక్కారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. తెలంగాణలో ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఏపీలో మాత్రం బీసీ సంఘాల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకునేవారు క‌రువ‌య్యారు. గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలో అయినా.. ఇప్పుడు జ‌గ‌న్ పాల‌న‌లో అయినా.. బీసీల త‌ర‌ఫున‌, వారి హ‌క్కుల త‌ర‌ఫున పెద్ద‌గా దూకుడుగా ఉన్న ముందుకు వ‌చ్చే నేత‌లు క‌రువ‌య్యార నేది వాస్త‌వం.

అయితే.. అప్పుడ‌ప్పుడు గ‌ళాలు వినిపిస్తున్నా.. మాకు కూడా రాజ్యాధికారం కావాల‌ని.. ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నా.. ఆశించిన విధంగా మాత్రం దూకుడు లేద‌నేది వాస్తవం. అంతేకాదు… రాజ‌కీయ నేత‌లుగా రాణించేందుకు అవ‌కాశం వ‌స్తే.. పోటీ చేసేందుకు నేత‌లు రెడీ కావ‌డం మ‌రింత వివాదానికి దారితీస్తోంది. మ‌రి ఈ ప‌రిస్థితి మారితేనే .. బీసీల మ‌ధ్య ఐక్యత కొన‌సాగుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.