కాంగ్రెస్ లో ఇంకా ఆశ చావలేదా ?

కాంగ్రెస్ పార్టీ ఏపి అధ్యక్షుడు సాకే శైలజానాద్ పెద్ద జోక్ చేశారు. అదేమిటయ్యా అంటే మెగాస్టార్ చిరంజీవి ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారట. తనకిష్టమైన సినీరంగంలో ఉండటం వల్ల, కరోనా వైరస్ కష్టకాలంలో సినీ కార్మికులకు సేవ చేయటంలో బిజీగా ఉండటం వల్లే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారట. చిరంజీవితో పాటు ఆయన కుటుంబమంతా మొదటినుండి కాంగ్రెస్ వాదులేనట. భవిష్యత్తులో చిరంజీవి సేవలు కాంగ్రెస్ కు మళ్ళీ అందిస్తారని శైలజానాద్ చెప్పటమే విచిత్రంగా ఉంది.

నిజానికి 2009లో ప్రజారాజ్యంపార్టీ పెట్టకముందు చిరంజీవి ఏ రాజకీయ పార్టీ తోను అంటకాగలేదన్నది వాస్తవం. పార్టీపెట్టి నడిపించే సత్తా లేకపోవటంతోనే కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. విలీనం సమయంలో బేరం మాట్లాడుకుని రాజ్యసభ సభ్యత్వం తీసుకుని కేంద్రంలో మంత్రి పదవిలో సెటిలైపోయారు. రాష్ట్ర విభజ జరిగిపోయి, తన ఎంపి కాలపరిమితి ముగిసిన తర్వాత నుండి మళ్ళీ సినిమాలకే పరిమితమైపోయిన విషయం అందరికీ తెలిసిందే.

రాజ్యసభ అయిపోయిన తర్వాత అసలు రాజకీయాలంటేనే తెలీదన్నట్లుగా చిరంజీవి వ్యవహరిస్తున్నారు. మళ్ళీ రాజకీయాల్లో వస్తే గిస్తే వైసీపీలోకే ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందికానీ ఇంకే పార్టీలో కూడా చేరరని తెలిసిందే. ఎందుకంటే ఘోరంగా ఓడిపోయి చుక్కాని లేని నావలాగ తయారైన టీడీపీలోకి వెళ్ళినా మెగాస్టార్ చేయగలిగేది ఏమీలేదు. ఇక తమ్ముడు పవన్ కల్యాణ్ అధ్యక్షుడుగా ఉన్న జనసేనలోకి వెళ్ళినా ఏమి చేయాలో చిరంజీవికి తెలీదు. ఎందుకంటే పార్టీని ఎలా నడపాలనే విషయంలో తమ్ముడికే క్లారిటిలేదు.

పై పార్టీల సంగతే ఇలాగుంటే ఇక బీజేపీ, కాంగ్రెస్ గురించి ఆలోచించటమే వృధా. క్షేత్రస్ధాయిలో వాస్తవం ఇలాగుంటే చిరంజీవి మళ్ళీ కాంగ్రెస్ లోకి వస్తారు, కార్యక్రమాల్లో పాల్గొంటారని సాకే చెప్పటమే పెద్ద జోక్. కాంగ్రెస్-చిరంజీవికి సంబంధించి ‘ఏరుదాటిన తర్వాత..’ అన్న సామెత గుర్తుకొస్తుంది జనాలకు. జనాలకు తెలీని విషయం సాకే చెప్పినా అర్ధముంది కానీ అందరికీ తెలిసిన విషయానికి విరుద్ధంగా శైలజానాద్ చెప్పటమంటే పాపం కాంగ్రెస్ పార్టీకి చిరంజీవిపై ఇంకా ఆశచావలేదన్నట్లే అనిపిస్తోంది.