జులై 24న నార‌ప్ప రిలీజ్?

కొంచెం గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ టాలీవుడ్లో కొత్త సినిమాల సంద‌డి మొద‌ల‌వ‌బోతోంది. థియేట‌ర్లు పూర్తి స్థాయిలో న‌డ‌వ‌డానికి ఇంకా కొన్ని నెల‌లు స‌మ‌యం ప‌ట్టేలా ఉండ‌టంతో కొత్త చిత్రాల‌ను ఓటీటీ బాట ప‌ట్టించే ప‌నిలో ఉన్నారు నిర్మాత‌లు. ఈ క్ర‌మంలోనే అగ్ర నిర్మాత సురేష్ బాబు త‌న ప్రొడ‌క్ష‌న్లో తెర‌కెక్కిన మూడు చిత్రాల‌ను ఓటీటీల్లో రిలీజ్ చేయ‌డానికి రెడీ అయిన‌ట్లు స‌మాచారం బ‌య‌టికొచ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో విరాట ప‌ర్వం సంగ‌తే కొంచెం అనుమానంగా ఉంది కానీ.. నార‌ప్ప‌, దృశ్యం-2 చిత్రాలు మాత్రం ఓటీటీ బాట ప‌ట్ట‌డం ప‌క్కా. ఇందులో ముందుగా నార‌ప్ప ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని స‌మాచారం. ఈ చిత్రాన్ని జులై 24న రిలీజ్ చేయ‌డానికి ముహూర్తం కూడా ఖ‌రారైన‌ట్లు తెలుస్తోంది.

నార‌ప్ప చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంద‌ట‌. పెట్టుబ‌డి మీద మంచి లాభానికే ఈ సినిమాను ప్రైమ్ వాళ్ల‌కు అమ్మిన‌ట్లు తెలుస్తోంది. విశేషం ఏంటంటే.. నార‌ప్ప ఒరిజిన‌ల్ అసుర‌న్ అమేజాన్ ప్రైమ్‌లోనే ఏడాదిన్న‌ర‌గా అందుబాటులో ఉంది. ఇప్పుడు రీమేక్‌ను కూడా అదే ఓటీటీ సొంతం చేసుకుంది. శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో వెంకీ స‌ర‌స‌న ప్రియ‌మ‌ణి న‌టించింది.

త్వ‌ర‌లోనే నార‌ప్ప ఓటీటీ రిలీజ్ గురించి అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నార‌ని, రిలీజ్ డేట్ కూడా వెల్ల‌డించ‌నున్నార‌ని స‌మాచారం. మ‌రోవైపు దృశ్యం-2 చిత్రాన్ని హాట్ స్టార్ సంస్థ కొనుగోలు చేసిన‌ట్లు చెబుతున్నారు. నార‌ప్ప వ‌చ్చిన నెల రోజుల గ్యాప్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసే అవ‌కాశాలున్నాయి. విరాట‌ప‌ర్వం ఓటీటీ రిలీజ్ విష‌యంలో సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయ‌ని.. త్వ‌ర‌లోనే స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని అంటున్నారు.