కత్తి మహేష్ హెల్త్ అప్‌డేట్

ప్రముఖ క్రిటిక్ కమ్ సోషల్ యాక్టివిస్ట్ కత్తి మహేష్ నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గాయాలు తీవ్రమైనవి కావడం, పరిస్థితి విషమించడంతో ముందు నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేసి, తర్వాత చెన్నైకి తరలించాల్సి వచ్చింది. హితులతో పాటు శత్రువులను కూడా అదే స్థాయిలో సంపాదించుకున్న కత్తి మహేష్ పరిస్థితేంటో తెలుసుకోవడానికి ఎంతోమంది ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన పేరు కొట్టి సెర్చ్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకట్ సిద్ధారెడ్డి లాంటి కొందరు కత్తి మహేష్ మిత్రులు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితిని అప్‌డేట్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం కత్తి మహేష్‌కు అవసరమైన సర్జరీలన్నీ పూర్తయ్యాయి. ఆయన్ని ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకు తరలించారు.

కత్తి మహేష్‌‌కు ముక్కు, కళ్లు, నుదురు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఈ భాగాల్లో అవసరమైన శస్త్ర చికిత్సలు చేశారు. మహేష్‌కు ఒక కంటికి చూపు పోయిందని, మొత్తంగా ఆయన చూపు కోల్పోయారని జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ ఈ విషయంలో అధికారిక సమాచారం ఏదీ లేదు. కత్తి మిత్రులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించట్లేదు. కళ్లకు తగిలిన గాయాలకు అపోలో వైద్యులతో కలిసి శంకర నేత్రాలయ వైద్యులు శస్త్రచికిత్సలు చేసినట్లు సమాచారం. కంటిచూపుపై కత్తి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆశాభావంతో ఉన్నారు. వైద్యులు కూడా పాజిటివ్‌గానే స్పందించినట్లు తెలుస్తోంది.

కాగా కత్తి మహేష్ వైద్యానికి భారీగానే ఖర్చవుతుండగా.. ప్రస్తుతానికి ఆయన హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారానే చికిత్స నడుస్తోందని.. కుటుంబ సభ్యులు కొంత భరిస్తున్నారని తెలిసింది. మహేష్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడంతో పాటు ఎన్నికల్లో ప్రచారం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఆయనకు ఎలాంటి సాయం అందట్లేదని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనకేదో సాయం చేస్తున్నట్లు యూట్యూబ్ ఛానెళ్లలో వస్తున్న వార్తలు అబద్ధమని తేలింది. కత్తికి సాయం చేస్తామంటూ చాలామంది మిత్రులు ముందుకొస్తున్నారని.. అవసరాన్ని బట్టి ఫండ్ రైజింగ్ మొదలుపెడతామని వెంకట్ సిద్ధారెడ్డి ఫేస్‌బుక్‌లో ప్రకటించారు. ప్రస్తుత వైద్యం కంటే.. రీహాబిలిటేషన్‌కు ఎక్కువ ఖర్చు అవుతుందని, అప్పుడు మిత్రులు సాయపడితే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు.