క‌త్తి మ‌హేష్‌కు ప్రాణాపాయం త‌ప్పింది కానీ..

వివాదాస్ప‌ద క్రిటిక్ క‌మ్ సోష‌ల్ యాక్టివిస్ట్ క‌త్తి మ‌హేష్‌కు శ‌నివారం యాక్సిడెంట్ జ‌రిగి తీవ్ర గాయాల పాల‌వ‌డం తెలిసిందే. త‌న వ్యాఖ్య‌ల‌తో, చ‌ర్య‌ల‌తో నిత్యం వార్త‌ల్లో ఉండే క‌త్తి మ‌హేష్‌కు ఇలా కావ‌డంతో సోష‌ల్ మీడియాలో ఈ వార్త చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న ప‌రిస్థితి ఏంట‌ని తెలుసుకోవ‌డానికి చాలామంది ఆస‌క్తి చూపిస్తున్నారు. హెల్త్ అప్‌డేట్ కోసం సోష‌ల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు.

ఐతే మ‌హేష్ మ‌రీ పెద్ద సెల‌బ్రెటీ ఏమీ కాక‌పోవ‌డం, ఆయ‌న కుటుంబం గురించి మామూలు జ‌నాల‌కు పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌డం, వారి నుంచి మీడియాకు కూడా స‌మాచారం లేక‌పోవ‌డంతో సందిగ్ధ‌త నెల‌కొంది. ఐతే మ‌హేష్‌కు స‌న్నిహితులైన కొంద‌రు మిత్రులు.. అత‌డి కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడుతూ ఫేస్ బుక్, ట్విట్ట‌ర్లో త‌న హెల్త్ అప్‌డేట్స్ ఇస్తున్నారు. వారి స‌మాచారం ప్ర‌కారం క‌త్తి మ‌హేష్‌కు ప్రాణాపాయం అయితే త‌ప్పింది.

కానీ మ‌హేష్ ఆరోగ్య ప‌రిస్థితి కొంచెం ఇబ్బందిక‌రంగానే ఉంది. యాక్సిడెంట్ జ‌రిగాక‌ నెల్లూరులోని మెడిక‌వ‌ర్ ఆసుప‌త్రిలో చికిత్స అందించిన అనంత‌రం శ‌నివారం రాత్రి మ‌హేష్‌ను చెన్నైకి త‌ర‌లించారు. అక్క‌డి అపోలో ఆసుప‌త్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. త‌ల‌కు బ‌ల‌మైన గాయాలు త‌గిలిన నేప‌థ్యంలో బ్రెయిన్ డ్యామేజ్ అయిందేమో అని ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. ఏ ఇబ్బందీ లేద‌ని తేలింది. న్యూరాల‌జిస్ట్ చూసి అంతా ఓకే అన్నార‌ట‌

. కంటికి సంబంధించిన ప‌రీక్ష‌లు జ‌రుగుతుండ‌గా.. చూపు కోల్పోయే ప్ర‌మాదం లేద‌ని చెబుతున్నారు. ముఖానికి గ‌ట్టి దెబ్బ‌లు తాక‌డంతో ముక్కులోప‌లి ఎముక‌తో పాటు.. మ‌రికొన్ని ఎముక‌లు చిట్లాయ‌ని.. బోన్ రీక‌న్‌స్ట్ర‌క్ష‌న్ జ‌రుగుతోంద‌ని తెలిసింది. మ‌హేష్ ఇంకా స్పృహ‌లోకి రాలేద‌ని.. మాట్లాడే స్థితిలోనూ లేడ‌ని తెలిసింది. ప్రాణాపాయం త‌ప్పినప్ప‌టికీ.. మ‌హేష్ మామూలు మ‌నిషి కావ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టొచ్చ‌ని, కొన్ని ఇబ్బందుల‌తో దీర్ఘ కాలం పోరాడాల్సి ఉంటుంద‌ని అంటున్నారు.