రేవంత్‌కు ప‌గ్గాలు.. కోమ‌టి రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు

రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ ప‌గ్గాలు అప్ప‌గించడం కాంగ్రెస్ పార్టీలో పెద్ద చిచ్చే రేపేలా ఉంది. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న నేత‌ల్ని కాద‌ని.. మొద‌ట్నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండి కొన్నేళ్ల కింద‌టే కాంగ్రెస్‌లోకి వ‌చ్చిన రేవంత్‌ను టీపీసీసీ ప్రెసిడెంట్‌ను చేయ‌డం ఏంటంటూ పార్టీలో అసంతృప్తి స్వ‌రాలు మొద‌ల‌య్యాయి.

ఇప్ప‌టికే రేవంత్‌తో తీవ్ర విభేదాలున్న మేడ్చ‌ల్ మాజీ ఎమ్మెల్యే, సీనియ‌ర్ నేత కిచ్చ‌న్న‌గారి ల‌క్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయ‌డం తెలిసిందే. కాగా ఇప్పుడు టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌విపై ఎప్ప‌ట్నుంచో ఆశ‌తో ఉన్న సీనియ‌ర్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి లైన్లోకి వ‌చ్చారు. ఉత్త‌మ్‌కుమార్ రెడ్డిని అధ్య‌క్షుడిని చేసిన‌ప్ప‌టి నుంచే త‌న అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కుతూ వ‌స్తున్న కోమ‌టిరెడ్డి ఇప్పుడు రేవంత్ నియామ‌కంపై తీవ్రంగానే స్పందించారు.

రేవంత్ ఓటుకు నోటు కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న విష‌యాన్ని గుర్తు చేస్తూ.. టీపీసీసీ అధ్య‌క్ష ఎన్నిక కూడా ఓటుకు నోటు త‌ర‌హాలోనే జ‌రిగిన‌ట్లు తాను ఢిల్లీ వెళ్లాక తెలిసింద‌ని కోమ‌టిరెడ్డి అన్నారు. టీపీసీసీ కొత్త కార్య‌వ‌ర్గాన్ని అభినందిస్తూ.. వీళ్లంతా క‌లిసి హుజారాబాద్ ఉప ఎన్నిక‌లో డిపాజిట్ తెచ్చుకోవాలంటూ వ్యంగ్యాస్త్రం విసిరారు కోమ‌టిరెడ్డి. అంతే కాక‌.. రేవంత్ లాంటి వ‌ల‌స నేత‌ల రాక‌తో టీపీసీసీ కాస్తా టీటీడీపీలా త‌యార‌వ‌బోతోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

రేవంత్ త‌న‌ను క‌లిసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. ఆయ‌న‌తో పాటు త‌న‌ను ఎవ్వ‌రూ క‌ల‌వొద్ద‌ని కోమ‌టిరెడ్డి అన్నారు. నిజ‌మైన‌ కాంగ్రెస్ నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు గుర్తింపు లేద‌న్న కోమ‌టిరెడ్డి.. మొద‌ట్నుంచి పార్టీలో ఉన్న త‌న లాంటి వాళ్ల‌కు అన్యాయం జ‌రిగింది కాబ‌ట్టి త‌మ‌కూ అలాగే జ‌రుగుతుంద‌ని కార్య‌క‌ర్త‌లు ఆవేద‌న చెందుతున్న‌ట్లు చెప్పారు. ఇబ్ర‌హీంప‌ట్నం నుంచి భువ‌న‌గిరి వ‌ర‌కు సోమ‌వారం నుంచి పాద‌యాత్ర చేయ‌బోతున్న‌ట్లు కోమ‌టిరెడ్డి వెల్ల‌డించారు.