రేవంత్ కే పీసీసీ ఎందుకిచ్చారో తెలుసా ?

మొత్తానికి అనుకున్నది అదికూడా చాలా స్పీడుగా రేవంత్ రెడ్డి సాధించారు. రేవంత్ ను తెలంగాణా పీసీసీ అధ్యక్షునిగా నియమిస్తు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. సీనియర్ల నుండి ఎన్ని అభ్యంతరాలున్నప్పటికీ వాటిని కాదని అధిష్టానం రేవంత్ వైపు మొగ్గుచూపటం ఆశ్చర్యంగా ఉంది. అయితే రేవంత్ కు పీసీసీ పీఠ దక్కటం అంత సులువుగా మాత్రం సాధ్యంకాలేదు.

తొందరలోనే సాధారణ ఎన్నికలున్న కారణంగా కేసీయార్ పై గట్టిగా పోరాటం చేయగలిగిన నేత రేవంత్ మాత్రమే అని అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. నిజానికి పీసీసీ పీఠం అందుకునేందుకు కాంగ్రెస్ లో ఎంతోమంది సీనియర్లు చాలామందున్నారు. కానీ వారిలో సమర్ధులు లేరనే చెప్పాలి. సమర్ధతత అంటే పదిమందిని కూడగట్టుకోవటం, వందమందిని ప్రభావితం చేయగలగటం, కేసీయార్ పై నిఖార్సయిన పోరాటం చేయటం లాంటి అంశాల్లో రేవంత్ మాత్రమే అందరికన్నా ముందున్నారని సమాచారం.

టీడీపీలో ఉన్నప్పటినుండి కేసీయార్ పై రేవంత్ గట్టిపోరాటాలే చేస్తున్నారు. ఓటుకునోటు కేసులో పట్టుబడి అరెస్టయిన తర్వాత ఆ పోరాటం ఇంకా ఎక్కువైంది. అయితే టీడీపీలో నుండి కాంగ్రెస్ లో చేరిన తర్వాత తన పోరాటానికి మరింత పదునుపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో కేసీయార్ పై గట్టి పోరాటం చేస్తున్నదెవరంటే రేవంత్ అని మాత్రమే జనాలు అనకునేంతగా రేవంత్ ఎదిగిపోయారు.

ఇపుడున్న కాంగ్రెస్ నేతల్లో చాలామంది కేసీయార్ కోవర్టులే అన్న ఆరోపణలు అందరికీ తెలిసిందే. పట్టుమని తెలంగాణాలో నాలుగురోజులు కూడా వరసగా పర్యటనలు చేసి పది సభల్లో మాట్లాడలేని నేతలు కూడా పీసీసీ పీఠాన్ని ఆశించనవారే. గడచిన దుబ్బాక, గ్రేటర్, నాగార్జునసాగర్ ఎన్నికల్లో రేవంత్ కష్టపడినట్లు ఇకెవరు కష్టపడలేదన్నది వాస్తవం. నేతలందరి ట్రాక్ రికార్డు చూసిన తర్వాత కేసీయార్ పై నిఖార్సయిన పోరాటం చేయగలిగింది ఎవరనే నిర్ధారణకు రావటంతోనే రేవంత్ కు పీసీసీ అద్యక్ష పదవిని కట్టబెట్టినట్లు సమాచారం. మరి రేవంత్ ఏమి చేస్తారో చూడాలి.