చంద్రబాబు బాటలోనే జగన్

మిగిలిన విషయాల్లో ఎలాగున్నా ఉద్యోగుల పెన్షన్ విషయంలో మాత్రం చంద్రబాబానాయుడునే జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నారా ? అనే డౌటు పెరిగిపోతోంది. ఉద్యోగులకు చంద్రబాబు వ్యతిరేకం అనే బలమైన ముద్రఉంది. ఇపుడు జగన్ పైన కూడా అలాంటి ముద్రే పడే ప్రమాధం కనిపిస్తోంది. దీనంతటికీ కారణం ఏమిటంటే ప్రతిపక్షంలో ఉన్నపుడు ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు విషయంలో ఇచ్చిన హామీని తప్పటమే.

అప్పట్లోనే సీపీఎస్ రద్దు చేసి పెన్షన్ విషయంలో పూర్వ విధానాన్నే అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు చంద్రబాబును పదే పదే కోరాయి. అయితే ఎన్నిసార్లు కలిసినా ఉపయోగం లేకపోయింది. దాంతో కొద్దిరోజుల సమ్మెచేసిన ఉద్యోగ సంఘాల నేతలు జగన్ను కలిశారు. అప్పటికే పాదయాత్రలో ఉన్న జగన్ ఉద్యోగసఘాల నేతలకు హామీనిచ్చారు. తాము గనుక అధికారంలోకి వస్తే ఎలాంటి కమిటిలు వేసి టైం చేయకుండా వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తానని గట్టిగానే హామీ ఇచ్చారు.

జగన్ తర్వాత ఉద్యోగసంఘాల నేతలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా ఇదే విషయమై కలిసి హామీ తీసుకున్నారు. సీన్ కట్ చేస్తే మొన్నటి ఎన్నికల్లో జగన్ అఖండ విజయంతో అధికారంలోకి వచ్చారు. కాబట్టి తమకిచ్చిన హామీని జగన్ అమలు చేస్తారని ఉద్యోగసంఘాల నేతలు అనుకున్నారు. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్ళు గడిచిపోయినా రద్దు విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. పైగా హామీకి విరుద్ధంగా కమిటీల మీద కమిటీలు వేస్తున్నారు.

తమ హామీ నెరవేర్చే విషయంలో జగన్ దాటవేత వైఖరితో ఉద్యోగసంఘాల నేతలు మండిపోతున్నారు. నిజానికి ఉద్యోగులను దూరం చేసుకున్న ఏ ప్రభుత్వానికైనా తర్వాత ఇబ్బందులు ఎదురైన విషయం అందరికీ తెలిసిందే. ఉద్యోగులు మాత్రమే కాదు రిటైర్ అయిన వారు, ఉద్యోగులు+రిటైర్ అయిన ఉద్యోగుల కుటుంబాలు కట్టకట్టుకుని అధికార పార్టీకి వ్యతిరేకంగ చేస్తే ఎన్నికల్లో తీరని నష్టం తప్పదు. మరి ఈ విషయం తెలీకుండానే జగన్ సీపీఎస్ రద్దుపై జగన్ దాటవేత ధోరణిని అవలంభిస్తున్నారా ? చూద్దాం ఏమి జరుగుతుందో.