ధ‌నుష్‌ను మెప్పించిన తెలుగు ద‌ర్శ‌కుడ‌త‌డేనా?


ఉన్న‌ట్లుండి త‌మిళ స్టార్ హీరోల చూపు టాలీవుడ్ మీద ప‌డుతోంది. ఒక‌ప్ప‌టితో పోలిస్తే త‌మిళ సినిమాల క్వాలిటీ ప‌డిపోగా.. అక్క‌డి స్టార్ డైరెక్ట‌ర్లు ఒక్కొక్క‌రుగా ఫామ్ కోల్పోతున్నారు. అదే స‌మ‌యంలో గ‌త కొన్నేళ్ల‌లో జాతీయ స్థాయిలో తెలుగు సినిమాలకు, వాటి డైరెక్ట‌ర్లకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు ఇండియాలో టాలీవుడ్ ఉన్న ఊపులో మ‌రే ఇండ‌స్ట్రీ లేద‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలోనే తెలుగు ద‌ర్శ‌కుల‌తో బ‌హుభాషా చిత్రాలు చేయ‌డానికి త‌మిళ స్టార్లు ఆస‌క్తి చూపిస్తున్నారు.

విజ‌య్.. వంశీ పైడిప‌ల్లితో, ధ‌నుష్‌.. శేఖ‌ర్ క‌మ్ముల‌తో సినిమాలు ఖ‌రారు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. సూర్య.. బోయ‌పాటి శ్రీను, త్రివిక్ర‌మ్‌ల‌తో సినిమాలు చేసే అవ‌కాశాలున్న‌ట్లుగా వార్త‌లొస్తున్న సంగతి తెలిసిందే. కాగా క‌మ్ముల సినిమా త‌ర్వాత ధ‌నుష్ మ‌రో తెలుగు ద‌ర్శ‌కుడికి క‌మిట్మెంట్ ఇచ్చిన‌ట్లుగా తాజాగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

రొమాంటిక్ సినిమాలు తీసే యువ ద‌ర్శ‌కుడు అంటూ ధ‌నుష్ ఇంప్రెస్ అయిన డైరెక్ట‌ర్ గురించి మీడియాలో వార్త‌లొస్తున్నాయి. ఆ ద‌ర్శ‌కుడు.. వెంకీ అట్లూరి అని తెలుస్తోంది. వెంకీ తొలి చిత్రం తొలి ప్రేమ‌.. ఆ త‌ర్వాత తీసిన మిస్ట‌ర్ మ‌జ్ను, రంగ్‌దె రొమాంటిక్ సినిమాలే అన్న సంగతి తెలిసిందే. త‌మిళంలో మ‌రీ ఇంటెన్స్ సినిమాలు చేసే ధ‌నుష్‌.. వాటితో కొంత మొనాట‌నీ ఫీల‌వుతున్న‌ట్లున్నాడు. అందుకే కుటుంబ ప్రేక్షకులు, యువ‌త‌ను ఆక‌ట్టుకునే లైట్ హార్టెడ్, ఎంట‌ర్టైనింగ్ మూవీస్ చేయ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నట్లున్నాడు. ఇలాంటి సినిమాల‌కు తెలుగు ద‌ర్శ‌కులు పెట్టింది పేరు.

తెలుగు మార్కెట్‌ను కూడా దృష్టిలో ఉంచుకుని అత‌ను ద్విభాషా చిత్రాల‌కు సై అంటున్న‌ట్లు క‌నిపిస్తోంది. మ‌రి ధ‌నుష్‌తో వెంకీకి సినిమా ఓకే అయిన‌ట్లు వ‌స్తున్న వార్త‌ల్లో నిజ‌మెంతో చూడాలి. కొన్ని రోజుల్లోనే ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది. వెంకీ చివ‌ర‌గా తీసిన రంగ్‌దె అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది.