వైఎస్ కూడా ఇలా చేయ‌లేదు.. జ‌గ‌న్‌పై బాబు ఫైర్‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వ్య‌వ‌హారంపై మ‌రోసారి ఆవేద‌న‌, ఆక్రంద‌న వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తు న్న తీరును తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కూడా ఇలా ఎప్పుడూ చేయ‌లేద‌ని అన్నారు. తాజాగా పార్టీ శ్రేణులు, మీడియాతో వ‌ర్చువ‌ల్‌గా ప్ర‌సంగించిన చంద్ర‌బాబు.. జ‌గ‌న్ వైఖ‌రిపై నిప్పులు చెరిగారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి సహా… ఏపీని పాలించిన ముఖ్యమంత్రులెవరూ సీఎం జగన్ తరహాలో రాష్ట్రాన్ని తిరోగమన బాట పట్టించలేదన్నారు. రెండేళ్లలోనే ఇలా ఉంటే… రాబోయే మూడేళ్లు ఎలా ఉంటుందోనని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీలో విధ్వంసానికి పునాదులు ప‌డి రెండేళ్లు పూర్త‌య్యాయ‌న్న చంద్ర‌బాబు.. మ‌రో మూడేళ్ల పాల‌న‌ను త‌లుచుకుంటేనే బాధ క‌లుగుతోంద‌ని అన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో రాష్ట్రంలో విధ్వంసాలకు పునాది వేసి నేటికి రెండేళ్లయిందని మండిపడ్డారు. కూల్చివేతలే తప్ప ఏ ఒక్కటీ కట్టకుండా తన పాలనా స్వభావాన్ని ప్రజలకు తెలియజెప్పాడన్నారు. ఈ రెండేళ్ళలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని మండిపడ్డారు. అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తిరోగమన బాట పట్టాయని విమర్శించారు. రెండేళ్ళలోనే ఇలా ఉంటే.. రాబోయే మూడేళ్ళలో రాష్ట్రం ఎలా ఉంటుందో అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

సంక్షేమం పేరుతో ప్ర‌జాధనాన్ని అయిన వారికి దోచిపెడుతున్నార‌ని.. దుయ్య‌బ‌ట్టారు. పార‌ద‌ర్శ‌క‌త లేని పాల‌న‌తో జ‌గ‌న్ వ్య‌వ‌హ రిస్తున్నార‌ని.. కేసులు… మొట్టికాయ‌లు అన్న‌చంద‌గా పాల‌న తీరు ఉంద‌ని దుయ్య‌బ‌ట్టారు. ప‌రీక్ష‌ల విష‌యంలోనూ స‌రైన విధానంతో వ్య‌వ‌హ‌రించేలేక‌.. సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టే వ‌ర‌కు తెచ్చుకున్నార‌ని.. అన్నారు. విద్యార్థ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడాల‌ని జ‌గ‌న్ ప్ర‌య‌త్నించార‌ని.. సుప్రీం కోర్టు క‌నుక స్పందించ‌క‌పోయి ఉంటే.. ప‌రిస్థితి తీవ్రంగా ఉండేద‌ని.. రాష్ట్రం శ‌వాల దిబ్బ‌గా మారి ఉండేద‌ని చెప్పారు. జ‌గ‌న్‌ పాల‌న‌ను చూసి పొరుగు రాష్ట్రాలు ఛీ కొడుతున్నాయ‌ని.. చెప్పారు. ఇప్ప‌టికైనా.. జ‌గ‌న్ దిగి రావాల‌ని.. ప్ర‌తిప‌క్షాల‌ను వేధించ‌డం, కేసులు న‌మోదు చేయ‌డంపైనే దృష్టిపెట్టార‌ని విమ‌ర్శించారు.