వైఎస్ పై శ్రీనివాస్ గౌడ్ షాకింగ్ వ్యాఖ్యలు

సంబంధం లేని అంశాల్ని తెర మీదకు తీసుకురావటం రాజకీయాల్లో మామూలే. జరుగుతున్న అంశాలకు సంబంధం లేని వారి పేర్లను తెర మీదకు తీసుకొచ్చి.. నోటికొచ్చినట్లు తిట్టటం మామూలే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఇది సరిపోదన్నట్లుగా మంత్రులు మండిపడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సాధారణంగా రాజకీయాల్లో ఎవరైనా సరే.. దివంగత నేతల మీద ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయటానికి ఇష్టపడరు. అందుకు భిన్నంగా తాజాగా శ్రీనివాస్ గౌడ్ మర్యాదల్ని పక్కన పెట్టేసి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని నోటికి వచ్చినట్లుగా విమర్శలు చేయటం షాకింగ్ గా మారింది. తెలంగాణ నీటిని దోచుకుంటుంటే వైఎస్సార్ ను దొంగ అనక ఏమంటారు? కడుపులో కత్తెర పెట్టుకొని నోట్లో చెక్కర అన్నవైఖరితో ఏపీ నేతలు ఉన్నారన్నారు.

తెలంగాణ నరరూప రాక్షసుడు వైఎస్ రాజశేఖర్రెడ్డిగా అని పేర్కొన్న ఆయన ఉద్యమంలో ఉన్న వారి మీద అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. దివంగత నేత పి. జనార్దన్ రెడ్డి మరణానికి కారణమన్నారు. తమ విగ్రహాలు ఏపీలో ఉండవు కానీ ఏపీ వారి విగ్రహాలు తెలంగాణలోని ప్రతి జిల్లాల్లో ఉన్నాయన్నారు. తెలంగాణ మీరిచ్చినట్లే విగ్రహాలు పెట్టుకున్నారని.. తెలంగాణ అధికారుల్ని ఏపీలో ఇబ్బందులకు గురి చేసినట్లుగా వ్యాఖ్యానించారు. మొత్తంగా ఏపీ మీద తనకున్న వ్యతరేకతను తన మాటలతో చెప్పేశారని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రమంత్రి చేసిన వ్యాఖ్యలకు ఏపీ అధికాపక్ష నేతలు మరెలా రియాక్టు అవుతారో చూడాలి.