బాలీవుడ్ మీద కాజల్ బాంబు

టాలీవుడ్లో అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన ఇలియా, తాప్సి లాంటి వాళ్లు.. తెలుగు చిత్రాలతో పాటు సౌత్ సినిమాల మీద కౌంటర్లు వేసిన సందర్భాలు చూశాం. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం ఇందుకు భిన్నంగా మాట్లాడింది. బేసిగ్గా తను ముంబయి అమ్మాయే అయినప్పటికీ.. ఆమె సౌత్ ఫిలిం ఇండస్ట్రీలకు ఎలివేషన్ ఇచ్చి.. బాలీవుడ్ మీద విమర్శలు గుప్పించడం విశేషం.

బాలీవుడ్లో నైతిక విలువలు ఉండవు అంటూ ఆమె పెద్ద స్టేట్మెంటే ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవలే బాలీవుడ్ మీద అక్కడి స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా విమర్శలు గుప్పించిన నేపథ్యంలో పెద్ద చర్చ నడుస్తోంది. కాజల్ సైతం ఈ టాపిక్ మీద స్పందించింది.
‘‘నేను ముంబయి అమ్మాయిని. పుట్టి పెరిగిందంతా అక్కడే. కానీ నా కెరీర్ మొదలైంది మాత్రం హైదరాబాద్‌లో.

తెలుగు, తమిళ సినిమాల్లోనే నేను ఎక్కువగా పని చేశాను. బాలీవుడ్లోనూ కొన్ని సినిమాలు చేసినప్పటికీ హైదరాబాద్, చెన్నైలనే నా నివాస నగరాలుగా భావిస్తా. అది ఎప్పటికీ మారదు. దక్షిణాది సినీ పరిశ్రమలో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. టాలెంట్ ఉంటే చాలు ఇక్కడ ఎవరినైనా ఆదరిస్తారు. హిందీ నా మాతృ భాష.

నేను హిందీ సినిమాలు చూస్తూనే పెరిగా. కానీ దక్షిణాది ఫిలిం ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడ్లో నైతికత, క్రమశిక్షణ, నైతిక విలువలు లోపించాని భావిస్తున్నా’’ అని కాజల్ పేర్కొంది. ఆమె వ్యాఖ్యల పట్ల బాలీవుడ్ సినీ ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందీలో స్పెషల్ చబ్బీస్, సింగం-2 సహా కొన్ని చిత్రాల్లో కాజల్ నటించింది. కానీ ఆమె కెరీర్ అక్కడ ఎప్పుడూ ఊపందుకోలేదు. ఇక బాలీవుడ్లో తనకు అవకాశాలు రావని ఫిక్సయ్యాకే కాజల్ ఇలా మాట్లాడుతోందంటూ ఆమె మీద నార్త్ ఇండియన్స్ మండిపడుతున్నారు.