సంచయితకు మహిళా కమీషన్ బాసటగా నిలుస్తుందట

మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తాజా ప్రకటన చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. వాసిరెడ్డి తాజా ప్రకటన చూస్తే తన పరిధిని మించి మాట్లాడుతున్నట్లు స్పష్టం గా అర్థమవుతోంది. ఆమె మహిళా కమిషన్ విధులను ఇంకో రకంగా అర్థం చేసుకున్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. మహిళా కమీషన్ అన్నది మహిళల హక్కులకు భంగం కలిగినపుడో లేకపోతే మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు జరిగినపుడో న్యాయం కోసం పనిచేయాల్సిన సంస్ధ. అలాంటి సంస్ధకు ఛైర్ పర్సన్ ఉన్న వ్యక్తి తన పరిధి దాటి వ్యవహరిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.

ఇంతకీ వాసిరెడ్డి చెప్పేదేమిటంటే మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ గా తొలగించిన సంచయిత గజపతిరాజు తరపున రాష్ట్రప్రభుత్వం సుప్రింకోర్టులో కేసు వేయాలట. అలాగే కోర్టు తీర్పు కారణంగా పదవిని కోల్పోయిన సంచయితకు మహిళా కమీషన్ అండగా నిలుస్తుందట. నిజానికి ఈ రెండు విషయాలకు మహిళా కమీషన్ కు ఎలాంటి సంబంధము లేదనే అనుకోవాలి.

ఎందుకంటే సంచయిత విషయంలో ఏమి చేయాలనే విషయాన్ని ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. ఇందులో వాసిరెడ్డి సలహా అవసరమే లేదు. ఒకవేళ హైకోర్టు తీర్పుపై ఏదైనా అభ్యంతరాలుంటే సంచయిత వ్యక్తిగత హోదాలో సుప్రింకోర్టులో కేసు వేసుకోవచ్చు. ఇదే సమయంలో హైకోర్టు తీర్పుపై సుప్రింకోర్టులో కేసువేసే విషయాన్ని ప్రభుత్వమే నిర్ణయించుకుంటుంది.

ఇక సంచయితకు మహిళా కమీషన్ బాసటగా నిలుస్తుందని వాసిరెడ్డి ప్రకటనలో కూడా అర్ధంలేదు. ఎందుకంటే సంచయితపై ఎవరు దాడి చేయలేదు. మానసికంగా, శారీరకంగా సంచయితపై ఎక్కడా దాడి జరగలేదు. కోర్టు తీర్పు ప్రకారమే ఆమె పదవిని కోల్పోయింది. దానిపై ఏవైనా అభ్యంతరాలుంటే ఆమె కోర్టులోనే తేల్చుకుంటుంది. ఇంతోటిదానికి మహిళా కమీషన్ బాసట ఎందుకు ? సంచయిత విషయం కన్నా మహిళా కమీషన్ దృష్టి పెట్టాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయని వాసిరెడ్డి గ్రహిస్తే బాగుంటుంది.