మంత్రిగారి మెడ‌కు.. అశోక్‌-ర‌ఘురామ వ్య‌వ‌హారం..!

ఏపీలో సామాజిక వ‌ర్గం రాజ‌కీయం హీటెక్కింది. ముఖ్యంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి వివాదాల జోలికీ పోని.. వివాదాస్ప‌ద రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం ఒక్క‌సారిగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. దీనికి రీజ‌నేంటి? ఎందుకు? అంటే.. టీడీపీ మాజీ ఎంపీ, మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు విష‌యంలో మంత్రులు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక‌, వైసీపీ సొంత ఎంపీ, రెబ‌ల్‌గా మారిన‌.. ర‌ఘురామ‌రాజు పై కూడా కొన్నాళ్లుగా మంత్రులు, ఇత‌ర నేత‌లు.. ఎమ్మెల్యేలు కూడా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయితే.. ఈ రెండు విష‌యాల్లోనూ ర‌ఘురామ విష‌యాన్ని క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.

పైగా వైసీపీ సొంత ఎంపీ కావ‌డ‌మో.. లేక.. ఇరు ప‌క్షాల్లోనూ త‌ప్పులు ఉండ‌డం వ‌ల్లో త‌లియ‌దు కానీ.. క్ష‌త్రియ వ‌ర్గం ర‌ఘురామ విష‌యంలో సైలెంట్ అయిపోయింది. కొంద‌రు క్ష‌త్రియులు ర‌ఘురామ అరెస్టు వ్య‌వ‌హారం త‌ర్వాత జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని తీవ్రంగా త‌ప్పుప‌ట్టినా మెజార్టీ క్ష‌త్రియుల నుంచి ర‌ఘురామ‌కు స‌పోర్ట్ అయితే రాలేదు. కానీ, విజ‌య‌న‌గ‌రం జిల్లా కు చెందిన అశోక్ గ‌జ‌ప‌తి రాజు విష‌యంలో మాత్రం.. మంత్రులు, వైసీపీ నాయ‌కులు మాన్సాస్ ట్ర‌స్టును అడ్డుపెట్టి విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని స‌హించ‌లేక పోయింది. ఈ క్ర‌మంలోనే భారీ ఎత్తున ప‌త్రిక‌ల్లో ఈ విమ‌ర్శ‌ల‌ను ఖండిస్తూ.. ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చారు క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం నేత‌లు.

అయితే.. ఇది సున్నిత వ్య‌వ‌హారం కావ‌డం. పైగా ఇప్ప‌టి వ‌ర‌కు క్ష‌త్రియ నేత‌లు ఎవ‌రూ కూడా ఇప్ప‌టి వ‌రకు వివాదం కాక‌పో యేస‌రికి వారిపై సానుభూతి పెరిగింది. కానీ, హ‌ఠాత్తుగా.. మంత్రి శ్రీరంగ‌నాథ‌రాజు జోక్యం చేసుకున్నారు. క్ష‌త్రియులు జ‌గ‌న్‌కు ఓ లేఖ‌ను విడుద‌ల చేస్తూ పేప‌ర్ల‌లో ప్ర‌క‌ట‌న ఇచ్చారు. ర‌ఘునాథ‌రాజు ఈ ప్ర‌క‌ట‌న‌ను త‌ప్పుబ‌ట్టారు. పైగా ఈ ప్ర‌క‌ట‌న‌కు క్ష‌త్రియ వ‌ర్గానికి సంబంధం లేద‌ని చెప్పారు. అటు అశోక్‌పైనా.. ఇటు ర‌ఘురామ రాజుపైనా ఫైర‌య్యారు. మొత్త‌గా చూస్తే.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఆయ‌న వ‌కాల్తాపుచ్చుకుని.. వీరిపై ఫైర‌య్యారు. అయితే.. ఈ ప్ర‌యోగం విక‌టించే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఎందుకంటే.. క్ష‌త్రియ వ‌ర్గంలో మంత్రి రంగ‌నాథ‌రాజుపై సానుభూతి ఉంది.

జ‌గ‌న్ కేబినెట్‌లో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌చ్చినా.. లేక 2019లో ఆచంట నుంచి విజ‌యం ద‌క్కించుకున్నా.. దీని వెనుక ఫుల్లు గా క్ష‌త్రియుల స‌పోర్టు ఉండ‌డంతోనే సాధ్య‌మైంది. కానీ, ఇప్పుడు వారికి వ్య‌తిరేకంగా.. ప్ర‌భుత్వానికి.. అనుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డంపై క్ష‌త్రియులు మండిప‌డుతున్నారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో న‌ర‌సాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్ర‌సాద‌రాజు మాత్రం.. ఈ విష‌యంలో మౌనంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈయ‌న ఒక్క‌రే కాదు.. క్ష‌త్రియ వ‌ర్గానికి చెందిన వైసీపీ నేత‌లు మౌనంగానే ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి రంగ‌నాథ‌రాజు మాత్రం దూకుడుగా వ్య‌వ‌హ‌రించి.. ఆగ్ర‌హానికి గుర‌య్యార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.