ముంచుకొస్తున్న డెల్టా ఫ్లస్.. ఇది మరీ డేంజర్!

Delta

కరోనా మహమ్మారి మన దేశంలో విలయతాండవం సృష్టించింది. ఈ మహమ్మారి సెకండ్ వేవ్ లో సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఇప్పుడిప్పుడే.. దాని నుంచి కోలుకుంటున్నాం. కాగా.. అంతలోనే.. ఈ మహమ్మారి మరో రూపంలో పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రెండో దశలో అత్యధిక కేసులకు కారణమైన డెల్టా వేరియంట్.. ఇప్పుడు డెల్టాప్లస్‌ వేరియంట్‌గా రూపాంతరం చెందింది. దాంతో ప్రభుత్వాలు ఈ కొత్తరకం ప్రభావాన్ని అంచనా వేసే పనిలోపడ్డాయి. అయితే ఇది ఇప్పటికే మూడు రాష్ట్రాలకు పాకినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికైతే కేంద్రం దీన్ని “వేరియంట్‌ ఆఫ్ ఇంట్రెస్ట్‌గా” మాత్రమే వర్గీకరించింది. దాని తీవ్రతను బట్టి ఆందోళనకర వేరియంట్‌గా వర్గీకరించాలో లేదో నిర్ణయించనుంది.

అయితే మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌లో డెల్టాప్లస్‌ వేరియంట్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 21 డెల్టాప్లస్ వేరియంట్ కేసులను గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అత్యధికంగా రత్నగిరిలో తొమ్మిది కేసులు బయటపడగా.. జల్‌గావ్‌లో ఏడు, ముంబయిలో రెండు, పాల్ఘర్‌, ఠానే, సింధుదుర్గ్‌ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున వెలుగులోకి వచ్చినట్లు చెప్పింది. మే 15 నుంచి 7,500 నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టగా 21 కేసులను గుర్తించినట్లు పేర్కొంది. అలాగే డెల్టాప్లస్‌ వేరియంట్‌తో మహారాష్ట్రలో మూడోముప్పు పొంచి ఉందని ఆరోగ్యశాఖ ఇదివరకే అంచనా వేసింది.

మరోపక్క కేరళలో కూడా మూడు కేసులు, మధ్యప్రదేశ్‌ ఒక కేసు బయటపడినట్టు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో 64 ఏళ్ల మహిళ నుంచి సేకరించిన నమూనాల్లో ఈ రకాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ వేరియంట్ మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ఔషధాన్ని ఏమారుస్తుందనే నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. మూడోముప్పుపై వార్తలు వస్తోన్న క్రమంలో ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించడం కొనసాగించాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.