రాజ రాజ చోర.. థియేటర్లలోకి రాదా?


విభిన్నమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన యువ కథానాయకుడు శ్రీ విష్ణు నుంచి వస్తున్న కొత్త సినిమా ‘రాజ రాజ చోర’. హాసిత్ గోలి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో మేఘా ఆకాష్ కథానాయిక. దర్శకుడు రవిబాబు కీలక పాత్ర పోషించాడు. ఇటీవలే విడుదలైన దీని ప్రి టీజర్, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి. సినిమా మీద ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్ కాపీతో రెడీ అయిపోయినట్లు సమాచారం. త్వరలోనే విడుదల చేయాలనుకుంటున్నారు.

ఐతే తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేయడం, ఏపీలోనూ ఆ దిశగా అడుగులు పడే అవకాశం ఉండటంతో థియేటర్లు పూర్తి స్థాయిలో నడుస్తాయని అంచనా వేస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం బిగ్ స్క్రీన్స్ లోనే రిలీజవుతుందని అనుకుంటున్నారు.

కానీ ‘రాజ రాజ చోర’ థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి ఓటీటీ డైరెక్టర్ రిలీజ్ కోసం డీల్ పూర్తయిందట. జీ5 వాళ్లు హక్కులు కొనేసినట్లు సమాచారం. మంచి రేటుకే సినిమాను అమ్మేసి లాభాలు అందుకున్నారట నిర్మాతలు. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఐతే జీ5 వాళ్లు సినిమాలను హోల్‌సేల్‌గా కొనేసి కొన్నిసార్లు అవకాశాన్ని బట్టి థియేట్రికల్ రిలీజ్ కూడా తామే చేస్తుంటారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని అలాగే రిలీజ్ చేశారు. కొన్ని రోజులకు ఓటీటీలో రిలీజ్ చేసుకున్నారు.

‘రాధె’ సినిమాను వీలున్న చోట థియేటర్లలో రిలీజ్ చేసి అదే రోజు ఓటీటీలో వదిలారు. డీల్ పూర్తయినపుడు ఓటీటీ రిలీజ్ అనే అనుకున్నారు కానీ.. ప్రస్తుతం పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో థియేటర్లలో కూడా రిలీజ్ చేసే అవకాశాన్ని పరిశీలించొచ్చు. లేదంటే నేరుగా ఓటీటీలోనే వదిలేయొచ్చు.