ఎలాంటి దర్శకుడు.. ఎలా అయిపోయాడు


సినిమా కలలతో సాఫ్ట్‌వేర్ రంగాన్ని వదిలిపెట్టి వచ్చేసి.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సత్తా చాటుకుని.. ఏ దర్శకుడి దగ్గరా పని చేయకుండానే నేరుగా మెగా ఫోన్ పట్టేసి.. చాలా తక్కువ బడ్జెట్లో ‘పిజ్జా’ అనే సినిమా తీసి సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. కేవలం 27 ఏళ్ల వయసులోనే అతను దర్శకుడిగా మారాడు. 2012లో విడుదలైన ‘పిజ్జా’ అటు తమిళంలో, ఇటు తెలుగులో ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. ఇక రెండో సినిమా ‘జిగర్ తండ’తో అయితే కార్తీక్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాడు. బాలీవుడ్ వాళ్లు కూడా ఆ సినిమా చూసి ఆశ్చర్యపోయారు. కొత్త తరహా చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులను అది ఉర్రూతలూగించింది. రెండే రెండు సినిమాలతో కార్తీక్ సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్లలో ఒకడైపోయాడు. కానీ ఈ రెండు చిత్రాలతో పెంచిన అంచనాలను కార్తీక్ ఆ తర్వాత అందుకోలేకపోయాడు.

అతడి మూడో సినిమా ‘ఇరైవి’ మంచి చిత్రమే కానీ.. తన తొలి రెండు చిత్రాల స్థాయిలో ఉండదు. అది అనుకున్నంతగా ఆడలేదు కూడా. ఐతే మళ్లీ కార్తీక్ బౌన్స్ బ్యాక్ అవుతాడనుకుంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ‘పేట’ లాంటి సాదాసీదా సినిమా తీసి నిరాశపరిచాడు. రజినీతో సినిమా అంటే అద్భుతాలు చేస్తాడనుకుంటే.. అంత మామూలు సినిమా తీస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. సూపర్ స్టార్ కాబట్టి మామూలు మాస్ సినిమా తీయాలనుకున్నాడేమో.. విలక్షణ చిత్రాలకు పెట్టింది పేరైన ధనుష్‌తో తన మార్కు సినిమా తీసి మెప్పిస్తాడనుకుంటే.. ఈ చిత్రంతో పూర్తిగా నిరాశ పరిచాడు కార్తీక్. నెట్ ఫ్లిక్స్‌లో శుక్రవారమే విడుదలైన ఈ చిత్రానికి పూర్తి నెగెటివ్ టాక్ వచ్చింది.

థియేటర్లలో రిలీజై ఉంటే ధనుష్ కెరీర్లోనే అది పెద్ద డిజాస్టర్ అయ్యేదనడంలో సందేహం లేదు. అసలు కార్తీక్ ఇలాంటి కథను ఎలా ఎంచుకున్నాడు.. ఏం చూసి ధనుష్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.. నిర్మాత అంత బడ్జెట్ ఎలా పెట్టాడు అని జనాలకు అర్థం కావడం లేదు. ముఖ్యంగా కార్తీక్ విషయంలోనూ అందరూ పెదవి విరుస్తున్నారు. తొలి రెండు చిత్రాలతో ఎంతో ఎగ్జైట్ చేసిన ఈ దర్శకుడు.. ఇలా తయారయ్యాడేంటని ఫీలవుతున్నారు. ఇక విక్రమ్, అతడి కొడుకు ధ్రువ్ ప్రధాన పాత్రల్లో తీస్తున్న సినిమాతో కార్తీక్ ఏమాత్రం మెరుపులు మెరిపిస్తాడో చూడాలి.