ఈ సినిమాను భలే వదిలించుకున్నారే..


జగమే తంత్రం.. జగమే తంత్రం.. గురువారం రాత్రి సౌత్ ఇండియన్ సినీ లవర్స్‌లో చాలామంది చర్చల్లో ఉన్న సినిమా ఇదే. సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా దాని గురించే చర్చ. ధనుష్-కార్తీక్ సుబ్బరాజ్‌ల ఎగ్జైటింగ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. అసురన్, కర్ణన్ లాంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత ధనుష్ నటించిన సినిమా ఇది. శుక్రవారం నెట్ ఫ్లిక్స్ ద్వారా నేరుగా ఆన్ లైన్లో రిలీజ్ చేశారు ఈ చిత్రాన్ని.

చిత్ర బృందంలోని వారే కాక.. నెట్ ఫ్లిక్స్ వాళ్లు సైతం ఈ సినిమా గురించి మామూలు హైప్ ఇవ్వలేదు. 190 దేశాల్లో, 17 భాషల్లో రిలీజ్ అంటూ ఘనంగా ప్రకటనలు ఇచ్చారు. పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్స్ కూడా వదిలారు. ధనుష్‌ ఓ కీలక పాత్రలో తమ కోసం ‘ది గ్రే మ్యాన్’ సినిమా చేస్తున్న హాలీవుడ్ దర్శకులు రుసో బ్రదర్స్‌తో సైతం నెట్ ఫ్లిక్స్ వాళ్లు ట్వీట్ వేయించారు. ఇంత హడావుడి జరిగాక చివరికి సినిమా చూసిన ప్రేక్షకులకు దిమ్మదిరిగింది.

ధనుష్ కెరీర్లోనే అత్యంత పేలవమైన చిత్రాల్లో ఒకటిగా ‘జగమే తంత్రం’ నిలుస్తుందనడంలో సందేహం లేదు. స్ట్రీమింగ్ మొదలైన గంటా గంటన్నరకే జనాలు సోషల్ మీడియాలో ఈ సినిమా మీద కౌంటర్లు మొదలుపెట్టారు. రాత్రికల్లా నెగెటివిటీ బాగా పెరిగిపోయింది. ఇక ఆ టైంలో బోలెడన్ని మీమ్స్, ట్రోల్ కంటెంట్ వచ్చి సోషల్ మీడియాను ముంచెత్తేసింది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ వాళ్లకు నిర్మాత సినిమాను అమ్మేయడం గురించే ఎక్కువ మీమ్స్ పడ్డాయి.

నిజానికి ఏడాది ముందే ఈ సినిమా పూర్తయింది. కరోనా ప్రభావం తగ్గాక థియేటర్లలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ నిర్మాత శశికాంత్ నెట్ ఫ్లిక్స్ వాళ్లతో డీల్ మాట్లాడేశాడు. ఇది ధనుష్‌కు నచ్చక తన అసంతృప్తిని బయటపెట్టేశాడు కూడా. కానీ చివరికి చేసేదేం లేక ఊరుకున్నాడు. ఐతే ఈ చిత్రం థియేటర్లలో రిలీజై ఉంటే మాత్రం హాహాకారాలే. బయ్యర్లు నిలువునా మునిగేవాళ్లు. నిర్మాతకూ గట్టి దెబ్బే పడేది. మొత్తానికి తెలివిగా నెట్ ఫ్లిక్స్ వాళ్లకు ఈ సినిమాను అంటగట్టేసి నిర్మాత భలే తప్పించుకున్నాడంటూ నెటిజన్లు ట్రోల్స్ వేస్తున్నారు.