థర్డ్ వేవ్ ముందు కేంద్రం కీలక ప్రకటన.. పిల్లలకు సీటీ స్కాన్ వద్దు

కరోనా ఉందా? లేదా? ఉంటే తీవ్రత ఎంత ఉంది? అన్న విషయాన్ని ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో తేలుస్తున్నా.. మరింత వివరంగా తెలుసుకోవాలన్న ఆత్రుతతో సీటీస్కాన్ ఛెస్టు చేయించుకోవటం తెలిసిందే. నిజానికి సీటీస్కాన్ తీయించుకోవటం ఖరీదైన వ్యవహారం అయినప్పటికీ.. రోగ నిర్దారణ సులువుగా జరగటంతో పాటు.. తీవ్రతను ప్రత్యక్షంగా తెలుసుకునే వీలు ఉండటంతో వీటి వైపునకు ఎక్కువగా మొగ్గుచూపారు. సీటీ స్కాన్ తో అత్యధిక రేడియేషన్ సమస్య ఉన్నప్పటికీ.. కరోనా తీవ్రతను కచ్ఛితంగా తెలుసుకోవటానికి ఈ విధానమే మేలన్న భావన ఎక్కువగా ఉంది.

ఇదిలా ఉంటే.. తాజాగా మూడో వేవ్ ముంచుకొస్తుందన్న వార్తల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. పిల్లల్లో కోవిడ్ 19 తీవ్రతను గుర్తించటానికి చెస్ట్ సీటీ స్కాన్ చేయొద్దని స్పష్టం చేసింది. శ్వాస తీసుకోవటంలో తీవ్ర ఇబ్బందులు ఉండి.. పరిస్థితులు మెరుగుపడలేదని అనిపించినప్పుడు మాత్రమే సీటీ స్కాన్ చేయాలని వెల్లడించింది.

ఆక్సిజన్ స్థాయి 90-93 మధ్యలో ఉంటే మధ్యస్థ స్థాయి లక్షణాలు ఉన్న కేసుగా గుర్తించాలని.. అలాంటి కేసుల్లో సీబీఎస్.. ఈఎస్ఆర్.. బ్లడ్ లో షుగర్.. ఛాతీ ఎక్స్ రే లాంటి పరీక్షలు చేయొచ్చని చెప్పింది. 90 శాతం లోపు ఆక్సిజన్ లెవల్స్ ఉంటేనే తీవ్రమైన కేసులుగా పరిగణించాలని పేర్కొంది. అంతేకాదు.. పిల్లలు ఎవరికి రెమ్ డెసివర్ ఇవ్వొద్దని తాజా మార్గదర్శకాల్లో స్పష్టం వెల్లడించారు.

సెకండ్ వేవ్ వేళ.. కరోనా బారిన పడిన వారిలో ఎక్కువ మందికి సిటీ స్కాన్ తీయించటంతో పాటు.. రెమ్ డెసివిర్ ను భారీగా ఉపయోగించటం తెలిసిందే. తాజాగా ఆ రెండింటిని వద్దని కేంద్రం ప్రకటించటం గమనార్హం.