రెండు మామిడి పండ్ల ధర రూ.2.5 లక్షలు..!

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఎక్కడ చూసినా మనకు మామిడిపండ్లు రాసులు పోసికనపడతాయి. సమ్మర్ లో కనీసం ఒక్క మామిడి పండు అయినా తినకుండా మ్యాంగో ప్రియులు అస్సలు ఉండలేరు. ఇక కిలో మామిడి పండ్లు ఎంత ధర ఉంటాయి. మహా అయితే రూ.100.. అంతకన్నా ఎక్కువ అంటే రూ.200 ఉంటాయి. లేదంటే ఆర్గానిక్ మామిడి పండ్ల పేరిట మరో రూ.100 ఎక్కవ వసూలు చేయచ్చు.

అయితే.. ఈ మామిడి పండ్లు మాత్రం అలా కాదు. కేవలం రెండు మామిడి పండ్లే.. రూ.రెండున్నర లక్షలు విలువ చేస్తుందంటే నమ్మగలరా..? నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. జపాన్ లో ఈ రకం మామిడి పండ్లు అమ్ముతున్నారు.

ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన మామిడి పండ్లను జపాన్ లో అమ్ముతున్నారు. “తైయో నో టామాగో” అనే మామిడి రకం జపాన్‌లోని మియాజాకి ప్రావిన్స్‌లో మాత్రమే ఏప్రిల్‌-ఆగ‌స్ట్ నెల‌ల్లోనే క‌నిపిస్తాయి. ఈ మామిడి పండ్లు రెండు దాదాపు రూ.2.5 లక్షల వరకు ధ‌ర ప‌లుకుతుంటాయి.

అదేంటి మామిడి పండ్లు ల‌క్ష‌ల్లోనా..? అని గుడ్లు తేలేస్తున్నారు క‌దూ! ఈ ర‌కం మామిడి పండ్ల‌ను ప్రత్యేక ఆర్డర్ తీసుకున్న‌ తర్వాతే పండిస్తారు. ఈ పండ్లు సగం ఎరుపు, సగం పసుపు రంగులో ఉంటాయి. జపాన్‌లో వేసవి-శీతాకాలాల మధ్య సీజన్‌లో పండిస్తారు. వీటిని ప్ర‌త్యేక ప‌ద్ధ‌తిలో పండిస్తున్నందు వ‌ల‌న‌ చాలా ఖర్చు అవుతుందంట‌. అందుకే రేటు కూడా అదిరిపోతుంది.

“తైయో నో టామాగోష అంటే జపాన్ భాష‌లో సూర్యుడి కోడిగుడ్డు. ఈ మామిడిలో యాంటీఆక్సిడెంట్స్‌ అధికంగా ఉంటాయి. బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ కలిగి ఉంటాయి. అలసిపోయిన కళ్ళ సహాయకారిణిగా ఉంటుంది. దృష్టి స‌మ‌స్య‌లు రాకుండా ఈ మామిడి పండ్లు కాపాడ‌తాయ‌ని పోష‌కాహార నిపుణులు చెప్తున్నారు. వీటిని ఇత‌ర దేశాల‌కు ఎగుమ‌తి చేసే ముందు వాటిని చాలా జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తార‌ని, అత్య‌ధిక నాణ్య‌తా ప్ర‌మాణాలు క‌లిగిన వాటినే ఎగుమ‌తి చేసేందుకు అక్క‌డి ప్ర‌భుత్వం అనుమ‌తిస్తుంది.

కాయ కాయ‌గానే వాటిని మెష్ వస్త్రంతో కట్టివేసి పెంచుతారు. ఒక్కో మామిడి పండు బరువు దాదాపు 350 గ్రాముల వరకు ఉంటుంది. అంటే రెండు పండ్లు 700 గ్రాముల‌కు రూ.2.5 లక్షల ధ‌ర ప‌లుకుతుంది. కిలో కావాలంటే రూ.3 లక్షలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ రేటు విని అందరూ నోరెళ్లపెడుతున్నారు.