తెలుగు మార్కెట్‌పై దండయాత్ర

ఒకప్పుడు తమిళ హీరోలు తెలుగు మార్కెట్లో ఆధిపత్యం చలాయించేవారో తెలిసిందే. రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోలకు తెలుగు స్టార్ హీరోలతో సమానంగా ఇక్కడ ఫాలోయింగ్ ఉండేది. వాళ్ల సినిమాలకు హిట్ టాక్ వస్తే ఇరగాడేసేవి. వీరి తర్వాత సూర్య, కార్తి, ధనుష్ లాంటి హీరోలు కూడా ఇక్కడ మంచి ఫాలోయింగే సంపాదించుకున్నారు.

కానీ గత కొన్నేళ్లలో మాత్రం తమిళ హీరోలకు తెలుగులో అంతగా ఆదరణ దక్కడం లేదు. ఒకప్పుడు తెలుగు సినిమాలతో పోలిస్తే కంటెంట్ పరంగా తమిళ చిత్రాలు చాలా మెరుగ్గా ఉండేవి. కానీ తర్వాత తర్వాత తెలుగు సినిమాల తీరు మారింది.

కోలీవుడ్ డైరెక్టర్లను మన దర్శకులు వెనక్కి నెట్టారు. వైవిధ్యమైన చిత్రాలతో ముందుకెళ్లారు. ‘బాహుబలి’ లాంటి భారీ సినిమాలు కూడా టాలీవుడ్ స్థాయిని పెంచాయి. మన పరిశ్రమ ఇలా ఎదుగుతున్న సమయంలోనే.. కోలీవుడ్ డౌన్ అయింది. తమిళ అనువాద చిత్రాలకు ఇక్కడ ఆదరణ కూడా తగ్గింది.

ఐతే తెలుగు మార్కెట్ సత్తా ఏంటో తెలిసిన తమిళ హీరోలు ఇప్పుడు ఈ మార్కెట్‌ను కొల్లగొట్టడానికి భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. మన దర్శకులతో వాళ్లు ద్విభాషా చిత్రాలకు సై అంటున్నారు. ఇంతకుముందు ప్రమోషన్లకు వచ్చినపుడు తెలుగులో సినిమా చేస్తాం అంటూ మొక్కుబడి ప్రకటనలు చేయడానికి పరిమితమైన తమిళ స్టార్లు.. ఇప్పుడు ఆ మాటల్ని నిజం చేస్తున్నారు. ఇప్పటికే విజయ్-వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ఓ సినిమా ఓకే అయిన సంగతి తెలిసిందే.

గత కొన్నేళ్లలో మిగతా తమిళ స్టార్లతో పోలిస్తే విజయ్‌ సినిమాలకే తెలుగులో ఆదరణ ఉంటోంది. వంశీ సినిమాతో ఇక్కడ తన ఫాలోయింగ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు విజయ్. ఇక సూర్య సైతం బోయపాటి శ్రీనుతో ఓ ద్విభాషా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా అధికారికంగా ఖరారవ్వాల్సి ఉంది. కాగా ఇప్పుడు శేఖర్ కమ్ములతో సినిమాను అనౌన్స్ చేశాడు ధనుష్. ఇలా ముగ్గురు బడా స్టార్లు తెలుగు దర్శకులతో సినిమాలు చేయబోతుండటం విశేషమే. ఈ బాటలో మరిందరు స్టార్లు పయనించినా ఆశ్చర్యం లేదు.