అజారుద్దీన్ పై అపెక్స్ కౌన్సిల్ వేటు..!

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ పై వేటు పడింది. ఈ నెల 2న హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్ ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అజారుద్దీన్‌పై కేసులు పెండింగ్‌లో ఉండటంతో ఆయన సభ్యత్వాన్ని హెచ్‌సీఏ రద్దు చేసింది. మరోవైపు అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంపై అజారుద్దీన్ స్పందించాల్సి వుంది.

అయితే, ఈ ఏడాది ఏప్రిల్ 11న జరిగిన హెచ్‌సీఏ సర్వసభ్య సమావేశంలో అజారుద్దీన్, విజయానంద్ వాగ్వాదానికి దిగారు. సర్వసభ్య సమావేశంలో 130 మంది క్లబ్ మెంబర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అంబుడ్స్ మెన్ గా జస్టిస్ దీపక్ వర్మను నియమించారు. ఈ నియామకం విషయంలో అజారుద్దీన్, విజయానంద్ మధ్య స్టేజీపైనే ఘర్షణ జరిగింది.

అయితే హెచ్‌సీఏలో అజారుద్దీన్ నాయకత్వంపై గతంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ప్రతిభావంతులైన ఆటగాళ్లను అజార్ ప్రోత్సహించడం లేదని విమర్శలు చేశారు. ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీల సెలక్షన్స్‌లో పలు అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

అజార్‌పై వున్న మ్యాచ్ ఫిక్సింగ్ కేసు విషయంపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేసి, ఆ కేసును సీబీఐతో పునర్విచారణ జరిపించాలని కోరతామని యెండల స్పష్టం చేశారు. అటు ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కూడా హెచ్‌సీఏలో ‌జరుగుతున్న అవకతవకలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్‌సీఏలో ప్రక్షాళన చేపడతామని స్పష్టం చేశారు. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే అజార్‌పై వేటు వేయడం గమనార్హం.