ఒక్క కోవిడ్ డోస్ ఐదు మందికి

కరోనా చికిత్స, వ్యాక్సినేషన్ విషయంలో ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు మారిపోవడం చూస్తూనే ఉన్నాం. గతంలో ప్లాస్మా చికిత్సతో అద్భుతాలు జరిగిపోతున్నట్లు చెప్పారు. ప్లాస్మా బ్యాంకులు కూడా ఏర్పాటు చేశారు. తీరా చూస్తే ఐసీఎంఆర్ ప్లాస్మా చికిత్సను రద్దు చేసింది. ఇక రెమిడిసివెర్ ఇంజక్షన్‌కు గతంలో ఎంత ప్రయారిటీ ఇచ్చారో తెలిసిందే. తర్వాతేమో కరోనా చికిత్సలో దానికంత ప్రాధాన్యం లేదని తేల్చేశారు.

ఇక కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య నిడివి విషయంలో ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు మారిపోతున్న సంగతి తెలిసిందే. కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్ నెల రోజులని.. 42 రోజులని చెప్పి.. చివరికి 84 రోజుల సుదీర్ఘ నిడివి పెట్టారు. ఇది కూడా ఫిక్స్ అనేమీ లేదు. ఈ గ్యాప్ మళ్లీ మారినా మారొచ్చు. ఇప్పుడిక వ్యాక్సిన్ విషయంలో మరో కీలకమైన మార్పు సూచిస్తున్నారు నిపుణులు.

ప్రస్తుతం జనాలకు వేస్తున్న కరోనా వ్యాక్సిన్ డోస్‌లో ఐదింట ఒక వంతు వేస్తే సరిపోతుందంటూ కొందరు నిపుణులు సూచిస్తుండటం గమనార్హం. కాకపోతే మామూలుగా వేసేలా కాకుండా భిన్నంగా వ్యాక్సినేషన్ చేయడం ద్వారా ఒక వ్యాక్సిన్ డోసును ఐదు మందికి వేయొచ్చని వారంటున్నారు. ఇంట్రాడెర్మల్‌ రూట్‌ (చర్మం కిందిపొర) ద్వారా అతి తక్కువ మోతాదులో కరోనా వ్యాక్సిన్‌ డోసు వేయొచ్చని, దీని వల్ల దేశంలో చాలా మందికి తక్కువ సమయంలో టీకాలు అందుతాయని నిపుణులు అంటున్నారు.

ప్రస్తుతం ఇంట్రామస్కులర్‌ రూట్‌ (భుజ కండరాల ద్వారా) ద్వారా టీకా వేస్తున్నారు. ఇందుకోసం ఒక డోసులో 0.5 ఎంఎల్ చొప్పున కొవిడ్‌ టీకాను వాడుతున్నారు. ఐతే ఇంట్రాడెర్మల్‌ రూట్‌లో వ్యాక్సినేషన్ చేస్తే 0.1 ఎంఎల్ డోసు సరిపోతుందట. అంటే ఇంట్రామస్కులర్‌ రూట్‌ ద్వారా ఒక్కరికి వేసే ఒక్క డోసును ఇంట్రాడెర్మల్‌ రూట్‌ ద్వారా ఐదుగురికి వేయొచ్చు. పైగా ఈ మార్గంలో తక్కువ డోసుతోనే అత్యంత సమర్థంగా వ్యాక్సిన్ పని చేస్తుందని కూడా అంటున్నారు. ఇప్పటికే ఈ పద్ధతి రాబిస్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో విజయవంతమైందని.. కొవిడ్ వ్యాక్సిన్ విషయంలోనూ ఈ పద్ధతిని అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.