ఢిల్లీలో ఉన్నరఘురామ గుంటూరు రావాల్సిందేనా?

విద్వేషాలు పెంచేలా సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు.. ప్రైవేటు వీడియోలు విడుదల చేస్తూ.. సమాజంలోని వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారన్న ఆరోపణలతో కేసు నమోదై.. అరెస్టు అయిన నరసాపురం ఎంపీ కమ్ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకు బెయిల్ మంజూరు కావటం తెలిసిందే. ఇదిలా ఉంటే బెయిల్ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నట్లుగా తాజాగా సీఐడీ న్యాయస్థానం ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. ఆయన రిమాండ్ ను ఈ నెల 25 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

దీంతో.. బెయిల్ నిబంధనలకు భిన్నంగా ఢిల్లీకి వెళ్లిన రఘురామ ఇప్పుడు గుంటూరుజైలుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడినట్లుగా చెబుతున్నారు. తనపై నమోదైన కేసులతో పాటు.. రిమాండ్ లో ఉన్న తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లుగా ఆరోపిస్తూ బెయిల్ కోసం.. మెరుగైన వైద్యం కోసం అనుమతులు ఇవ్వాలంటూ సుప్రీంను ఆశ్రయించటం తెలిసిందేన ఈ నేపథ్యంలో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.

అయితే..అందులో పేర్కొన్న నిబంధనల ప్రకారం రఘరామ గుంటూరు జైలుకు వచ్చి బెయిల్ పత్రాలపై సంతకం చేసి బయటకు రావాల్సి ఉంది. అయితే.. నిబంధనలకు విరుద్ధంగా గుంటూరు జైలుకు వచ్చి సంతకాలు చేయాల్సిన రఘురామ.. వైద్యం కోసమంటూ సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రి నుంచి బేగంపేట ఎయిర్ పోర్టులోని ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్లిపోయారు.

ఈ నేపథ్యంలో రఘురామ సంతకం లేని పత్రాల్ని గుంటూరు జైలు సూపరింటెండెంట్ ఈ నెల పదిన సీఐడీ కోర్టుకు సమర్పించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం.. బాండ్ పత్రాలపై నిందితుడు సంతకం చేయనందున ఆయన బెయిల్ పై విడుదల అయినట్లు కాదని పేర్కొంది. ఆయన రిమాండ్ వారెంట్ మనుగడలోనే ఉన్నట్లు భావిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయన రిమాండ్ ను ఈ నెల 25 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో గుంటూరుకు వచ్చి తన పత్రాలపై సంతకం చేస్తారా? మరేం జరుగుతుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. బెయిల్ మీద బయట ఉన్న ఎంపీ రఘురామకు తాజాగా కోర్టు రిమాండ్ ను పొడిగిస్తూ ఇచ్చిన ఆదేశాలు ఆయనకు కొత్త తలనొప్పిని తెచ్చి పెడతాయన్న మాట వినిపిస్తోంది.