దిల్ రాజు.. పాన్ ఇండియా స్టార్

తెలుగులో అగ్ర నిర్మాతల్లో ఒకడిగా ఎదిగిన దిల్ రాజు.. అంతటితో సంతృప్తి చెందేలా కనిపించడం లేదు. పాన్ ఇండియా లెవెల్లోటాప్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా పేరు సంపాదించే ప్రయత్నంలో ఆయన ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ‘జెర్సీ’, ‘ఎఫ్-2’ చిత్రాల రీమేక్‌లతో ఆయన బాలీవుడ్‌లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజు దృష్టి కోలీవుడ్ మీద పడింది. ఒకటి తర్వాత ఒకటి అన్నట్లు ఆయన కోలీవుడ్ ప్రముఖులతో సినిమాలు లైన్లో పెడుతుండటం చర్చనీయాంశంగా మారింది. అవన్నీ భారీ ప్రాజెక్టులే కావడం విశేషం.

రామ్ చరణ్ హీరోగా తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో రాజు ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. శంకర్‌తో సినిమా చేయాలని ఎన్నో ఏళ్లుగా ఎంతోమంది తెలుగు హీరోలు, నిర్మాతలు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. ఐతే శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్-2’ సినిమాను తనే నిర్మించడానికి ముందుకొచ్చి వెనక్కి తగ్గిన రాజు.. దాని తర్వాత శంకర్ చిత్రాన్ని తనే దక్కించుకున్నాడు. చరణ్‌తో సినిమాను కమిట్ చేయించాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో తీయడానికి రాజు భారీ ప్రణాళికలతో సిద్ధమవుతున్నాడు.

మరోవైపు తమిళంలో ప్రస్తుతం నంబర్‌వన్ హీరో అనదగ్గ విజయ్‌తోనూ రాజు సినిమా చేయబోతుండటం విశేషం. గత కొన్నేళ్లలో ఇంతింతై అన్నట్లు ఎదిగిపోయి, రజినీకాంత్‌ను కూడా వెనక్కి నెట్టేసిన విజయ్‌కు తెలుగులో కూడా ఫాలోయింగ్ పెరిగింది. దీన్ని క్యాష్ చేసుకుంటూ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా సినిమాకు రంగం సిద్ధం చేశాడు రాజు. విజయ్‌కు దాదాపు వంద కోట్ల పారితోషకం ఇస్తున్నాడట ఈ చిత్రం కోసం. ఇది కూడా పాన్ ఇండియా మూవీనే.

తాజాగా సూర్య హీరోగా కూడా మరో చిత్రాన్ని రాజు ఓకే చేసినట్లు వార్తలొస్తున్నాయి. బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడట. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఇలా వరుసగా రాజు తమిళ హీరోలు, దర్శకులతో సినిమాలు సెట్ చేస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తెలుగులో ఆయన హవా గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. ఇప్పుడిక హిందీ, తమిళంలోనూ క్రేజీ ప్రాజెక్టులు లైన్లో పెడుతున్నాడు. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా చిత్రం కూడా లైన్లో పెడుతున్న నేపథ్యంలో మున్ముందు జాతీయ స్థాయిలో రాజు పేరు మార్మోగేలాగే కనిపిస్తోంది.