నోట్ దిస్ పాయింట్‌.. జ‌గ‌న్‌పై ఒకే వారంలో ఇన్ని మెరుపులా..?

ఇంట గెలిచి.. ర‌చ్చ‌గెలవాల‌నేది సామెత‌. అచ్చం ఈ సామెత‌ను నిజం చేస్తున్నా ఏపీ సీఎం జ‌గ‌న్‌. ఆయ‌న రాష్ట్రంలో ఎన్ని అవ‌రోధాలు ఎదురైనా.. ప్ర‌జ‌ల‌కు సంక్షేమం అందించేందుకు చేస్తున్న కృషి అంద‌రికీ తెలిసిందే. అన్ని సామాజిక‌ వర్గాల‌కు ఎన్నిక‌ల స‌మయంలో ఇచ్చిన హామీల మేర‌కు జ‌గ‌న్ న్యాయం చేస్తున్నారు. ఆర్థిక ప‌రిస్థితి బాగున్నా.. లేకున్నా.. ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుని.. పేద‌ల‌కు అన్ని రూపాల్లోనూ సాయం చేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ప్ర‌జ‌లు జ‌గ‌న్ పాల‌న‌పై హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ పాల‌న‌పై.. జాతీయ స్థాయిలోనూ చ‌ర్చ సాగుతుండ‌డం.. మంచి మార్కులు ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. ఒకే వారంలో అనేక మంది జ‌గ‌న్ పాల‌న‌పై సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు. కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.10 లక్షల చొప్పున డిపాజిట్‌ చేయడం గొప్ప విషయమన్నారు. కోవిడ్‌ మూడో వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు రూ.180 కోట్లతో పిల్లల కోసం 3 ఆసుపత్రులను నిర్మించాలన్న నిర్ణయాన్నీ ఆయన అభినందించారు.

ఇక‌, రాష్ట్రంలో పేదల కోసం ఏకంగా 17,005 కాలనీల్లో 28 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టడం ప్రపంచంలోనే అరుదైన అంశమని కేంద్ర పట్టణ గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్‌ మిశ్రా ప్రశంసించారు. పేదల ఇళ్ల నిర్మాణాల కోసం జిల్లాకు ఒక జాయింట్‌ కలెక్టర్‌ను ప్రత్యేకంగా నియమించడం అంటే ప్రభుత్వం పేదలకు ఎంత ప్రాధాన్యత ఇస్తోందో స్పష్టం అవుతోందని అన్నారు. అదేస‌మ‌యంలోనీతి ఆయోగ్ కూడా ఏపీ స‌ర్కారుకు కితాబు ఇచ్చింది. క‌రోనా స‌మ‌యంలో పేద‌ల‌కు అందుతున్న వైద్యంపై నీతి ఆయోగ్ స‌భ్యులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

మ‌రోవైపు.. ఇదే స‌మ‌యంలో.. ఉన్నత విద్యకు సంబంధించి పలు రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే టాప్‌ రాష్ట్రాల జాబితాలో నిలిచింద‌ని ఆలిండియా సర్వే ఆన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్ వెల్ల‌డించింది. దేశంలో అత్యధిక విద్యార్థుల చేరికలున్న టాప్‌ రాష్ట్రాల్లో ఒకటిగా, అలాగే అత్యధిక ఉన్నత విద్యా సంస్థలున్న టాప్‌–8 రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. మన రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాకు 51 కాలేజీలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది.

కాలేజీల సంఖ్య ప్రకారం.. ఏపీ పెద్ద రాష్ట్రాలను సైతం వెనక్కి నెట్టి దేశంలో ఐదో స్థానంలో నిలవడం విశేషం. ఇవ‌న్నీ ఒకే వారంలో చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. అదేస‌మ‌యంలో ఏపీ సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న కూడా సానుకూల వాతావ‌ర‌ణంలో స‌క్సెస్ అవ‌డంతో వైసీపీ నేత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.