‘వకీల్ సాబ్’ మళ్లీ రిలీజ్ చేస్తారట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ల తరువాత ‘వకీల్ సాబ్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘పింక్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. మొదటి మూడు రోజుల్లో భారీ వసూళ్లను రాబట్టింది. మరికొన్ని రోజులు థియేటర్లో ఉంటే గనుక కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసేది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లను సడెన్ గా మూసేయడంతో ‘వకీల్ సాబ్’ కలెక్షన్స్ కు బ్రేక్ పడింది. ఆ తరువాత కొన్నాళ్లకు సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. దీంతో థియేటర్లో చూడని వారు ఓటీటీలో సినిమాను కవర్ చేశారు.

అయితే ఇప్పుడు నిర్మాత దిల్ రాజు మరోసారి ‘వకీల్ సాబ్’ సినిమాను థియేటర్లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే థియేటర్లు తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ఈ నెలాఖరుకి లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ లెక్కన చూసుకుంటే జూలైలో థియేటర్లు తెరుచుకోవచ్చు. అప్పటికప్పుడు రిలీజ్ చేయడానికి సినిమాలు రెడీగా ఉండకపోవచ్చు. అందుకే ‘వకీల్ సాబ్’ సినిమాను రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట.

మరోసారి పవన్ క్రేజ్ ను వాడుకొని జనాలను థియేటర్లకు రప్పించాలనుకుంటున్నారు. యాభై శాతం ఆక్యుపెన్సీ ఉంటుంది కాబట్టి పెద్ద సినిమాలు ఇప్పట్లో రిలీజ్ కావు. కాబట్టి ఆ గ్యాప్ ను ‘వకీల్ సాబ్’తో కవర్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే.. సినిమాలో కొన్ని సీన్లను యాడ్ చేయబోతున్నారట. నిడివి ఎక్కువ అవుతుందని ఎడిట్ చేసిన సన్నివేశాలను ఇప్పుడు జోడించబోతున్నారు. అలా ‘వకీల్ సాబ్’ కొత్త వెర్షన్ తో ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నారు. మరి ఈ కొత్త సీన్స్ చూడడానికి ప్రేక్షకులు థియేటర్ కు వస్తారో లేదో చూడాలి!