బీజేపికి నొప్పేంటో తెలుస్తోందా ?

దేశంలోని చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. అయితే ఆ అధికారం నేరుగా ప్రజలు ఇవ్వటం వల్ల వచ్చిందికాదు. కొన్ని రాష్ట్రాల్లో మెజారిటి లేకపోయినా అధికారంలోకి వచ్చేసింది. ఫలితాల సమయంలోనే ముందుగా మేల్కొనటం ద్వారా ప్రత్యర్ధిపార్టీలకు చెందిన ఎంఎల్ఏలను లోబరుచుకోవటం తదితర మార్గాల్లో అధికారంలోకి వచ్చేసింది.

అలాగే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ నేత జ్యోతిరాధిత్య సింధియాకు గాలమేయటం ద్వారా కాంగ్రెస్ పార్టీని చీల్చేసింది. దాంతో ప్రభుత్వం పడిపోగానే తాను అధికారంలోకి వచ్చేసింది. దాంతో బీజేపీ నుండి తమ ఎంఎల్ఏలను కాపాడుకోవటానికి కాంగ్రెస్, ఇతర పార్టీలు నానా అవస్తలు పడాల్సొస్తోంది. కర్నాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది.

ఇప్పుడిదంతా ఎందుకంటే పశ్చిమబెంగాల్లో తగిలిన ఎదురుదెబ్బ నుండి బీజేపీ తట్టుకోవటం కష్టంగా తయారైందట. ఎప్పుడే ఎంఎల్ఏ బీజేపీని వదిలేసి తృణమూల్ కాంగ్రెస్ లో చేరిపోతారో తెలీక అగ్రనేతలు నానా టెన్షన్ పడుతున్నారట. ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ మాతృసంస్ధ తృణమూల్లో చేరిపోయారు. దాంతో అదేదారిలో మరికొందరు ఎంఎల్ఏలు, నేతలు కూడా రెడీ అయిపోతున్నారు.

ముకుల్ దారిలోనే వెళ్ళాలని అనుకుంటున్న ఎంఎల్ఏలందరినీ బీజేపీలోనే ఉంచటానికి అగ్రనేతలు ఇబ్బందులు పడుతున్నారట. ఎంఎల్ఏలతో చర్చల కోసం ఏర్పాటుచేసిన రెండు సమావేశాలకు ఇప్పటికి ఎనిమిది మంది హాజరుకాలేదట. బీజేపీ శాసనసభా నేత సువేందు అధికారి ఫోన్లు చేసినా రెస్పాండ్ కావటంలేదని సమాచారం. సువేందు కూడా ఫిరాయింపు నేతే కావటం గమనార్హం.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఫిరాయింపు నేతలకు కానీ లేదా బీజేపీ ఎంఎల్ఏల్లో కొందరికి సువేందుతో ఏమాత్రం పడదట. అధికారానికి దూరంగా ఉండటం సాధ్యంకాక కొందరు, సువేందు అధికారితో పడక మరికొందరు ఎంఎల్ఏలు బీజేపీని వదిలేయటానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. మొత్తానికి ఎదుటిపార్టీల్లో నుండి ఎంఎల్ఏలను లాక్కోవటానికే అలవాటుపడిపోయిన బీజేపీ అగ్రనేతలకు ఇపుడు అలాంటి ఫిరాయింపులను కాపాడుకోవటంలో తలనొప్పులేంటో తెలుస్తోందా ?