మారి తప్పు చేశానంటున్న శ్రీను వైట్ల

టాలీవుడ్లో తిరుగులేని స్థాయిని అందుకున్న దర్శకుల్లో శ్రీను వైట్ల ఒకడు. ఢీ, రెడీ, కింగ్, దూకుడు సినిమాలతో ఒకప్పుడు వైట్ల ఎంత ఊపులో ఉన్నాడో తెలిసిందే. అతడితో పని చేయడానికి పెద్ద హీరోలు అమితాసక్తి చూపించారు. ఆ టైంలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఉన్నాడు వైట్ల. కానీ ‘బాద్‌షా’ దగ్గర్నుంచి వైట్ల తిరోగమనం మొదలైంది. ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడగా.. తర్వాత వైట్ల చేసినవన్నీ పెద్ద డిజాస్టర్లే. ఆగడు, బ్రూస్‌లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ.. ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయ్యాయి. దీంతో చూస్తుండగానే వైట్ల పరిస్థితి తల్లకిందులు అయిపోయింది. అతను ఔట్‌డేటెడ్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు.

ఐతే రెండేళ్లకు పైగా విరామం తర్వాత వైట్ల.. ఇప్పుడు ‘ఢీ అండ్ ఢీ’ సినిమాతో వార్తల్లోకి వచ్చాడు మంచు విష్ణు హీరోగా తాను తీసిన సూపర్ హిట్ మూవీ ‘ఢీ’కి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు వైట్ల. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలు కాబోతోంది.

ఈ సందర్భంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్లో ఎత్తు పల్లాల గురించి మాట్లాడాడు వైట్ల. మామూలుగా దర్శకులు ఫామ్ కోల్పోతే.. ట్రెండ్‌కు తగ్గట్లు మారనందుకు పరాజయాలు ఎదురైనట్లు భావిస్తారు. కానీ వైట్ల మాత్రం దీనికి భిన్నంగా మాట్లాడ్డం విశేషం. తాను తన శైలిని విడిచి పెట్టి ట్రెండును అందుకోవడం కోసం వేరే టైపు సినిమాలు తీయడమే తన పతనానికి కారణమని అతనన్నాడు. తన శైలికి కొంచెం భిన్నంగా వైట్ల తీసిన మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ దారుణ ఫలితాన్ని చవిచూడటం తెలిసిందే.

” నేను ట్రెండ్ మారిపోయిందనే అంచనాతో చేసిన పొరపాట్ల ఫలితమే నా కెరీర్లో ఒడుదొడుకులు అని భావిస్తా. నా సినిమాల నుంచి గతంలో ఎక్కువ వినోదం అందించాను కాబట్టి ప్రేక్షకులు ప్రతిసారీ అదే స్థాయి కామెడీని ఆశించారు. కానీ నేను నా టైమింగ్‌కు తగ్గట్లు కాకుండా వేరే టైపు కథలు ఎంచుకుని తప్పు చేశా. ఇక మళ్లీ అలాంటి పొరపాట్లు చేయదల్చుకోలేదు ” అని వైట్ల చెప్పాడు. ఐతే మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ వైట్ల శైలికి భిన్నమైన సినిమాలే కానీ.. అంతకుముందు తీసిన ఆగడు, బ్రూస్‌లీ ఆయన తరహా చిత్రాలే. కాకపోతే ఒకే ఫార్ములాను పట్టుకుని వేలాడటంతో అవి తేడా కొట్టాయి. ఆ ఫార్ములా విడిచిపెట్టి కొంచెం భిన్నమైన కథలు ఎంచుకుంటూనే అందులో కామెడీ డోస్ తగ్గకుండా చూసుకుంటే వైట్ల బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఛాన్సుంటుంది. మరి ‘ఢీ అండ్ ఢీ’ అలాంటి సినిమానే అవుతుందేమో చూడాలి.