బాలయ్య ఒక్క ఇంటర్వ్యూ ఇస్తే…

నందమూరి బాలకృష్ణ ఏం చేసినా సంచలనమే. మంచికో, చెడుకో.. ఆయన మీడియాలోకి వచ్చారంటే చర్చనీయాంశంగా మారాల్సిందే. మొన్న తన 61వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ చిన్నపాటి ప్రకంపనలే రేపింది. దీని చుట్టూ రెండు రోజులుగా ఎడతెగని చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా లేదు. ఆ ఇంటర్వ్యూ గురించి చాలామంది స్పేస్‌లు పెట్టి గంటలు గంటలు చర్చలు పెట్టారు.

నందమూరి అభిమానులే వర్గాలుగా విడిపోయి తెగ కొట్టేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం గురించి బాలయ్య చేసిన ఒక కామెంట్ మీద జరిగిన డిస్కషన్ అంతా ఇంతా కాదు. బాలయ్య వ్యాఖ్యలు రైటా రాంగా అన్నది పక్కన పెడితే.. ఆయన కామెంట్లు మాత్రం సంచలనం రేపాయి. ఆయన వ్యాఖ్యల ఉద్దేశమేంటి అనే దాని మీద ఎవరి ఉద్దేశాలకు తగ్గట్లు వాళ్లు వ్యాఖ్యానాలు, విశ్లేషణలు చేసుకున్నారు.

మరోవైపు సీనియర్ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చే విషయమై బాలయ్య చేసిన ఓ కామెంట్ కూడా తీవ్ర దుమారమే రేపింది. భారతరత్న ఎన్టీఆర్ కాలిగోటికి సమానం అంటూ యధాలాపంగా ఒక వ్యాఖ్య చేసేశారు బాలయ్య. ఎన్టీఆర్ గొప్పదనం గురించి ఎంతైనా చెప్పొచ్చు కానీ.. దేశ అత్యున్నత పురస్కారం ఎన్టీఆర్ కాలి గోటికి సమానం అనడం మాత్రం చాలామందికి రుచించట్లేదు. ఎందరో దిగ్గజాలకు దగ్గిన అత్యున్నత అవార్డు గురించి ఇలా మాట్లాడటం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే ‘యన్.టి.ఆర్’ సినిమాకు తాను న్యాయం చేయలేకపోయానంటూ ఇప్పుడిక తన తండ్రిపై పుస్తకం రాయబోతున్నానని, అది ఒక మహాభారతం, రామాయణం లాంటి గ్రంథం అవుతుందంటూ బాలయ్య చేసిన వ్యాఖ్య సైతం చర్చనీయాంశంగా మారింది. ఇక తన కొడుకు మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి బాలయ్య చేసిన వ్యాఖ్యలు సైతం మీడియాలో బాగా హైలైట్ అయ్యాయి.

ఆదిత్య 369 సీక్వెల్‌తో తన కొడుకు అరంగేట్రం చేస్తాడని.. తనే ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని బాలయ్య అనడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. మోక్షజ్ఞకు ఇష్టం లేకపోయినా నటనను అతడిపై రుద్దే ప్రయత్నం బాలయ్య చేస్తున్నాడని.. తన దర్శకత్వంలో కొడుకును సినిమాల్లోకి తీసుకొచ్చి అతడికి ఎలాంటి కెరీర్ ఇవ్వబోతున్నాడని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇలా బాలయ్య ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చి సామాజిక మాధ్యమాల్లో రేపిన రచ్చ అంతా ఇంతా కాదు.