ఓట్లు వేయించుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందా?

మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి. సీనియర్ నేత, సోనియా, రాహూల్ కోటరీలో ముఖ్యుడైన వీరప్ప మొయిలీ మాట్లాడుతు కాంగ్రెస్ పునరుజ్జీవనానికి పెద్ద ఆపరేషన్ అవసరమన్నారు. పనిలో పనిగా నాయకత్వం విషయంలో కేవలం వారసత్వంపైనే పార్టీ ఆధారపడేందుకు లేదని చెప్పటం ద్వారా తేనెతుట్టెను కదిపారనే అనుకోవాలి. నిజానికి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్ధితికి సీనియర్లే కారణమని చెప్పాలి.

పార్టీ అధికారంలో ఉన్నపుడు అన్నీ పదవులు, అపరిమతమైన అధికారాలను అనుభవించిన సీనియర్లే ఇపుడు కొత్తతరానికి పార్టీపగ్గాలు అప్పగించటానికి ఏమాత్రం ఇష్టపడటంలేదు. ఒకవైపు రోజురోజుకు పార్ట పరిస్దితి యావత్ దేశంలో దిగజారిపోతున్నా పునరుజ్జీవనానికి చేస్తున్న కృషి ఏమీలేదు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ విజయానికి సీనియర్లలో ఎంతమంది కృషిచేశారో చెప్పమంటే జవాబు లేదనే వినిపిస్తుంది.

మధ్యప్రదేశ్, రాజస్ధాన్, చత్తీస్ ఘడ్ లో అధికారంలోకి వచ్చిందంటే అది యువనేతల రెక్కల కష్టంమీద అని చెప్పాలి. కానీ పార్టీ అధికారంలోకి రాగానే యువ నేతలను కాదని సీనియర్లకే పట్టంగట్టారు. ఇలాంటి గొడవలతోనే మధ్యప్రదేశ్ లో అధికారాన్ని చేజార్చుకున్నది. ఈ నేపధ్యాన్ని దృష్టిలో పెట్టుకునే మొయిలీ పార్టీ బలోపేతానికి పెద్దాపరేషన్ అవసరమని బల్లగుద్ది చెప్పారు. అయితే పెద్దాపరేషన్ అంటే ఏమి చేయాలో మాత్రం చెప్పలేదు.

ఇక వారసత్వంపైన పార్టీ ఆధార పడేందుకు లేదన్న ప్రకటన కీలకమైందే. నిజానికి బలమైన సీనియర్ల కోటరీని తట్టుకోలేకే రాహూల్ అధ్యక్ష పదవికి గుడ్ బై చెప్పేశారు. కోటరీని కాదని సోనియా కూడా స్వతంత్రంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. కాబట్టి ముందుగా కోటరీని వదుల్చుకోలేకపోతే ఎన్ని పెద్దాపరేషన్లు చేసినా ఉపయోగం ఉండదు.

అలాగే కొత్త నాయకత్వానికి మద్దతుగా నిలబడటానికి యువనేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే కొత్త నాయకత్వం యువ నాయకత్వమైతేనే బాగుంటుంది. బీజేపీకి వ్యతిరేకంగా జనాలు కాంగ్రెస్ కు ఓట్లేయటానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఓట్లు వేయించుకునేందుకు పార్టీ సిద్ధంగా ఉందా అన్నదే అనుమానం. కాబట్టి చేసే పెద్దాపరేషన్ ఏదో వెంటనే తేల్చి నాయకత్వంపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే బాగానే ఉంటుంది. మరాపని కాంగ్రెస్ లో జరుగుతుందా ?