ఓటీటీలో స్టార్ హీరోల సినిమాలు!

కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో థియేటర్లన్నీ మూతపడ్డాయి. దీంతో చాలా మంది దర్శకనిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయి. మలయాళీ హీరోలు ఫహద్ ఫాజిల్, పృథ్వీరాజ్ సుకుమారన్ లు నటించిన సినిమాలను ఆన్ లైన్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. డబ్బింగ్ సినిమాల ద్వారా ఈ ఇద్దరు హీరోలకు తెలుగునాట కూడా మంచి గుర్తింపు ఏర్పడింది.

ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో ‘మాలిక్’, పృథ్వీరాజ్ హీరోగా ‘కోల్డ్ కేస్’ అనే రెండు సినిమాలను నిర్మించారు యాంటో జోసెఫ్. ఈ రెండు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ కేరళలో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో చాలా రోజులుగా అక్కడ లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. దీంతో ఈ రెండు సినిమాల రిలీజ్ ఆలస్యమవుతూ వస్తోంది. ఈ సినిమాకు ఫైనాన్స్ తీసుకొచ్చిన నిర్మాత ఇప్పటికీ వడ్డీలు కడుతూనే ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో నిర్మాత జోసెఫ్ ఈ రెండు చిత్రాలను ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయనే విషయంలో క్లారిటీ లేకపోవడం.. ఒకవేళ తెరుచుకున్నా కూడా యాభై శాతం ఆక్యుపెన్సీతో ఉండే అవకాశాలు ఉండడంతో నిర్మాతలంతా ఓటీటీలతో డీల్ చేసుకుంటున్నారు. అందుకే జోసెఫ్ కూడా ఇదే రూట్ లో వెళ్లాలని ఫిక్స్ అయ్యారు. ఫహద్ ఫాజిల్, పృథ్వీరాజ్ లకు మలయాళంలో మంచి క్రేజ్ ఉండడంతో ఈ రెండు సినిమాలకు అమెజాన్ సంస్థ భారీ డీల్ ఆఫర్ చేసిందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన రానుంది.